అక్షరటుడే, వెబ్డెస్క్ : Fake Doctor | దేశంలో నకిలీ వైద్యుల ఆగడాలు శృతి మించుతున్నాయి.. ఇష్టారీతిన వ్యవహరిస్తూ అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.
తాజాగా ఎంబీబీఎస్ (MBBS) మాత్రమే చదివిన ఓ వైద్యుడు కార్డియాలజిస్టు (Cardiologist)గా అవతారమెత్తడమే కాకుండా 8 నెలల్లో ఏకంగా 50కిపైగా గుండె ఆపరేషన్లు చేశాడు. ఈ విషయం ఇప్పుడు బయటకి రావడంతో శస్త్ర చికిత్సలు చేయించుకున్న రోగులు తమకు ఏమవుతుందోనని జంకుతున్నారు.
హర్యానా(Haryana state) రాష్ట్రంలోని ఫరీదాబాద్లో జరిగిన ఈ ఘటన వైద్య వృత్తిలోనే సంచలనంగా మారింది. నిందితుడు పంకజ్ మోహన్ శర్మ బాద్షాఖాఖాన్ సివిల్ దవాఖానాలోని హార్ట్కేర్ సెంటర్లో వైద్యుడిగా పనిచేస్తున్నాడు.
Fake Doctor | విషయం ఎలా తెలిసింది అంటే..?
మోహన్ శర్మ సుమారు ఎనిమిది నెలలకు పైగా కార్డియాలజిస్ట్గా (Cardiologist) చలామణి అవుతూ గుండె జబ్బులతో బాధపడుతున్న రోగులకు శస్త్రచికిత్సలు చేస్తున్నాడు. వాస్తవానికి అతడికి ఎంబీబీఎస్ (MBBS) పట్టా మాత్రమే ఉంది. గుండెకు సంబంధించిన సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసే అర్హత అతనికి లేదు. అయినా కూడా ఈ నకిలీ వైద్యుడు చికిత్సలు చేశాడు. ప్రస్తుతం ప్రాక్టీస్లో ఉన్న మరో నిజమైన కార్డియాలజిస్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ను ఉపయోగించి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడితో సర్జరీ చేయించుకున్న అనేక మంది రోగులు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని, వారిలో కొందరు మరణించినట్లు కూడా సమాచారం.
కాగా.. ఓ రోగి ద్వారానే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ శర్మ దగ్గర చికిత్స పొందిన ఒక రోగి, అనుమానంతో మరో కార్డియాలజిస్ట్ను సంప్రదించాడు. అనుమానం వచ్చిన ఆస్పత్రి యాజమాన్యం అంతర్గత విచారణ చేపట్టింది. విచారణలో డాక్టర్ పంకజ్ మోహన్ శర్మ సమర్పించిన పత్రాలు నకిలీవని తేలింది. నకిలీ పత్రాలతో మోసం చేసినట్లు నిర్ధారణ కావడంతో ఆస్పత్రి యాజమాన్యం పంకజ్ మోహన్ శర్మను తక్షణమే విధుల నుంచి తొలగించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు తాను ప్రిస్క్రిప్షన్ రాసే చీటీల పైనా ఎండీకి సమానమైన ‘డీఎన్బీ’(కార్డియాలజీ)గా నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడికి ఐఎంఏ నోటీస్ పంపింది.