అక్షరటుడే, వెబ్డెస్క్: Congress party | తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అంటేనే రెడ్ల పార్టీగా ఎప్పటి నుంచో ముద్ర పడింది. దశాబ్దాలుగా రెడ్ల (Reddys) ఆధిపత్యమే కొనసాగింది. పార్టీ కష్టకాలంలోనూ వెన్నంటి నిలిచిన రెడ్లకు కాంగ్రెస్ కూడా ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది.
అయితే, సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ వైఖరి ఇటీవలి కాలంలో చాలా మారింది. కాంగ్రెస్లో (Congress party) క్రమంగా రెడ్ల ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. అందుకు నిదర్శనమే తాజా మంత్రివర్గ విస్తరణ. ఆదివారం జరిగిన విస్తరణలో ముగ్గురికి మాత్రమే అవకాశం దక్కింది. గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సీనియర్లకు మాత్రం అవకాశం దక్కలేదు. మంత్రివర్గ విస్తరణలో (cabinet expansion) రెడ్డి సామాజికవర్గానికి చెందిన సుదర్శన్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి వంటి వారికి బెర్త్ లభిస్తుందని ప్రచారం జరిగింది. కానీ, చివరకు వారికి భంగపాటే ఎదురైంది.
Congress party | తగ్గిన రెడ్ల ప్రాబల్యం
దశాబ్దాలుగా కాంగ్రెస్లో (Congrees) రెడ్డి సామాజికవర్గం నేతలదే హవా కొనసాగింది. పార్టీని మొదటి నుంచి రెడ్లు మాత్రమే నడిపించారు. ఉమ్మడి రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, అప్పట్లో పల్లెల్లో రెడ్ల ప్రభావమే ఎక్కువగా ఉండేది. దీంతో సహజంగానే వారు రాజకీయాల్లో (Politics) రాణించారు. ప్రధానంగా కాంగ్రెస్ అంటేనే రెడ్ల పార్టీ (Reddys Party) అన్నట్లుగా ముద్ర పడింది. అందుకు తగినట్లుగానే వారు కాంగ్రెస్ను బలోపేతం చేశారు. ఈ నేపథ్యంలోనే నీలం సంజీవరెడ్డి నుంచి మొదలుకుని కాసు బ్రహ్మానందరెడ్డి, భవనం వెంకట్రామిరెడ్డి, నేదురుమల్లి జనార్దన్రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి, వైఎస్ రాజశేఖరెడ్డి, కిరణ్కుమార్రెడ్డి వంటి రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వరకు అదే కొనసాగింది.
Congress party | మారిన వైఖరి..
కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) వైఖరిలో చాలా మార్పు వచ్చింది. రెడ్ల ఆధిపత్యంలో ఇన్నాళ్లు కొనసాగిన పార్టీ క్రమంగా బలహీనవర్గాల పాట అందుకుంది. రాహుల్గాంధీ (Rahul gandhi) నాయకత్వం వచ్చిన తర్వాతే ఈ మార్పు మొదలైంది. సమాజంలో అత్యధికంగా ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని రాహుల్ భావించారు. ఈ దిశగానే కుల గణన (Caste Census) చేపట్టాలని కాంగ్రెస్ కేంద్రంపై ఒత్తిడి పెంచింది. అందుకు అనుగుణంగానే తెలంగాణలో రేవంత్ సర్కారు (Revanth Governament) కులగణన చేపట్టి, జనాభా ప్రాతిపదికన బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తామని ప్రకటించింది. అందులో భాగంగానే తాజా మంత్రివర్గ విస్తరణలో (cabinet expansion) రెడ్లకు చోటు దక్కకుండా పోయింది. ఇది మారిన కాంగ్రెస్ వైఖరికి నిదర్శనంగా నిలిచింది.
Congress party | సామాజిక సమీకరణలే కీలకం..
ప్రస్తుత మంత్రివర్గ విస్తరణలో బలహీనవర్గాల వారికే అవకాశం కల్పించారు. మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్కు, ముదిరాజ్ కులస్తుడైన శ్రీహరికి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్కు (Adluri Laxman) కేబినెట్లో చోటు దక్కింది. మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణలే కీలకంగా మారాయి. రాష్ట్రంలో బలమైన ముదిరాజ్ (Mudhiraj), మాదిగ కులస్తులు ఉండగా, వారికి ప్రాతినిధ్యం దక్కింది. ఇక, సీనియారిటీ కారణంగా వివేక్కు చోటు లభించింది. ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే.. మారిన కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టమవుతుంది. ఎంతో ఆశ పెట్టుకున్న సుదర్శన్రెడ్డి (Sudharshan Reddy), రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డికి సామాజిక సమీకరణలు పరాభవమే మిగిల్చాయి.
కాగా.. మళ్లీ చేపట్టే విస్తరణలో అగ్రవర్ణాలకు ప్రాధాన్యత ఇస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) ఇవాళ ప్రకటించారు. అయితే ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండదు. ఒకవేళ తప్పనిసరి అయితే.. అది లోకల్ బాడీ ఎన్నికలు (Local Body elections) పూర్తయిన తర్వాతే..! ఈ నేపథ్యంలో అప్పటి పరిస్థితుల దృష్ట్యా కొత్తగా మంత్రివర్గంలోకి ఎంపిక ఉంటుంది. ఇదే సమయంలో మళ్లీ ఇప్పటి మాదిరే.. సామాజిక సమీకరణాలు రిపీట్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా తాజా మంత్రివర్గ కూర్పు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.