అక్షరటుడే, వెబ్డెస్క్: RCB Victory Parade | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో తొలిసారిగా టైటిల్ గెలుచుకున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు సంబరాలు జరుపుకోవాలని అనుకున్నారు. కానీ బెంగళూరు నగర పోలీసులు ఆంక్షలు విధించారు. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం జట్టు విజేతగా నిలవడంతో అభిమానులు, ఆటగాళ్లు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ యాజమాన్యం బుధవారం మధ్యాహ్నం భారీ విజయోత్సవ పరేడ్ నిర్వహించాలని ప్రణాళిక రచించింది. గెలుపుతో ఫుల్ జోష్మీదున్న జట్టుకు బెంగళూరు నగర పోలీసులు (Bengaluru Police) షాకిచ్చారు. గ్రాండ్ విక్టరీ పరేడ్కు అనుమతిని నిరాకరించారు.
RCB Victory Parade | అలా చేశారేంటి..
ఆర్సీబీ నిర్వహించాలనుకున్న విక్టరీ పరేడ్ రద్దైంది (victory parade cancelled). సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకూ చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో సత్కార కార్యక్రమానికి మాత్రం అనుమతించారు. పోలీసుల నిర్ణయంతో ఆర్సీబీ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో సత్కార కార్యక్రమానికి మాత్రమే పరిమిత సంఖ్యలో అనుమతి లభించింది. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం, ఆర్సీబీ జట్టు బుధవారం మధ్యాహ్నం బెంగళూరుకు చేరుకున్న తరువాత, ఓపెన్ టాప్ బస్సులో మధ్యాహ్నం 3:30 గంటలకు విధానసౌధ నుంచి విజయోత్సవ ర్యాలీ ప్రారంభించి, సాయంత్రం 5 గంటలకు చిన్నస్వామి స్టేడియంకు చేరాలని భావించారు.
అక్కడ సుమారు 50 వేల మంది అభిమానుల సమక్షంలో సంబరాలు అంబరాన్నంటేలా ఏర్పాట్లు చేయాలని ఆర్సీబీ యాజమాన్యం యోచించింది. కానీ పోలీసులు Police అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక సత్కార కార్యక్రమం నిర్వహించుకోవడానికి పోలీసులు అంగీకరించిన స్టేడియంలోకి ప్రవేశం పరిమితం చేస్తున్నామని, టికెట్ లేదా పాస్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని వెల్లడించారు. స్టేడియం వద్ద పార్కింగ్ స్థలం కూడా తక్కువగా ఉన్నందున, అభిమానులు మెట్రో రైలు(Metro Train) లేదా ఇతర ప్రజా రవాణా మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు. సీబీడీ (సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్) ప్రాంతానికి రావాలంటే అత్యవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచనలు జారీ చేశారు.