అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nizamsagar backwater : కామారెడ్డి జిల్లా(Kamareddy district) ఎల్లారెడ్డి మండలం సోమార్ పేట్ శివారులోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో ఈతకు వెళ్లి గల్లంతైన యువకుల కోసం రెస్క్యూ బృందాలు(Rescue teams) గాలిస్తున్నాయి. తెల్లవారుజామునే ప్రత్యేక బలగాలు, గజ ఈతగాళ్లతో యువకుల కోసం నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో రెస్కూ ఆపరేషన్ చేపట్టారు. గల్లంతైన ముగ్గురిలో మధుకర్ మృతదేహం లభ్యమైంది.
నిన్న(సోమవారం) సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన యువకుల జాడ కోసం వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున నీటి వద్దకు చేరుకున్నారు. సోమార్పేట్ గ్రామ శివారులోని పిప్పిర్యాగడి తండా సమీపం వద్ద నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో 11 మంది యువకులు సరదాగా ఈతకు వెళ్లారు. వీరిలో ముగ్గురు చాలా లోపలికి వెళ్లి గల్లంతయ్యారు. మిగతా యువకులు ఒడ్డుకు చేరుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గల్లంతైన వారిని ఎల్లారెడ్డి, కళ్యాణి , సోమర్ పేట్ గ్రామాలకు చెందిన మధుకర్ గౌడ్ (17), నవీన్ (23), హర్షవర్ధన్ (17)గా గుర్తించారు.

విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి అధికారులు చేరుకున్నాక సహాయక చర్యలు చేపట్టారు. చీకటి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మధుకర్ మృతదేహం లభ్యమైంది. మిగతా ఇద్దరి జాడ తెలియాల్సి ఉంది. గల్లంతైన యువకుల కోసం వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. యువకుల గల్లంతుతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.