అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ration Cards | మూణ్నెళ్ల రేషన్ బియ్యం (Ration Rice) ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం (Central Government) నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. రానున్న వానాకాలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఆహార ధాన్యాల నిల్వ, రవాణాలో ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మూణ్నెళ్ల రేషన్ కోటాను లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్రాలకు సూచించింది.
Ration Cards | జూన్ 1వ తేదీ నుంచి..
ఆహార భద్రత కార్డుల (Food safety cards) లబ్ధిదారులకు మూణ్నెళ్ల రేషన్ బియ్యం జూన్ 1 నుంచి పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కోటాను జూన్ 1 నుంచి లబ్ధిదారులకు అందజేస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో మూడు నెలల బియ్యం ఒకేసారి అందనున్నాయి.
Ration Cards | మూడుసార్లు ఐరిస్ ఇవ్వాల్సిందే..
జూన్ మొదటి నుంచే పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు ఇప్పటికే డీలర్లకు సూచించారు. ఆహార భద్రత కార్డులోని ఒక్కో లబ్ధిదారునికి 6 కిలోల చొప్పున 18 కిలోలు, అంత్యోదయ కార్డు (Antyodaya card) ఉన్న వారికి 35 కిలోల చొప్పున 105 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు (Annapurna Cards) 10 కిలోల చొప్పున 30 కిలోల బియ్యం ఒకేసారి పంపిణీ చేయనున్నారు.
మూడు నెలల సన్నబియ్యం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు నెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నందున కార్డుదారులు డీలర్ వద్ద ఈపాస్ యంత్రంలో మూడుసార్లు బయోమెట్రిక్ లేక ఐరిష్ గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుందని కామారెడ్డి డీఎస్వో మల్లిఖార్జున్ తెలిపారు. గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం రవాణా ప్రారంభించినట్లు పేర్కొన్నారు.