అక్షరటుడే, వెబ్డెస్క్:Phoenix | బీఆర్ఎస్ గంపగుత్తగా బీజేపీ(BJP)లో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం రేపాయి. తాను జైలులో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వచ్చిందని ఆమె వెల్లడించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి.
నిజంగానే గులాబీ పార్టీని విలీనం చేయడానికి కేసీఆర్ సిద్ధపడ్డారా? అప్పటిదాకా కేంద్రంపై ఒంటి కాలిపై లేచిన బీఆర్ఎస్ వైఖరి ఆ తర్వాత ఎందుకు మారింది? బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగిందా? ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లతో పాటు సామాన్య ప్రజల్లో తలెత్తుతున్న సందేహాలివి. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ తన ఆశీర్వాదం కోరారని ప్రధాని మోదీ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు నాడు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మరోసారి మోదీ వ్యాఖ్యలు తెరపైకి వస్తున్నాయి. అప్పటి పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే.. నిజంగానే బీజేపీలో కలిసి పోవడానికి బీఆర్ఎస్ సిద్ధపడిందన్న వాదన వినిపిస్తోంది. ఫీనిక్స్ సంస్థపై ఐటీ సోదాలే దీనికంతటికీ కారణమని ప్రచారం జరుగుతోంది.
Phoenix | ఫీనిక్స్పై దాడుల తర్వాతే..
హైదరాబాద్ కేంద్రంగా పని చేసే రియల్ ఎస్టేట్ కంపెనీ ఫీనిక్స్ కార్యాలయం(Phoenix Office)పై ఆగస్టు 23, 2022లో ఐటీ అధికారులు దాడులు చేశారు. ఢిల్లీ నుంచి 30 ప్రత్యేక బృందాలు కంపెనీకి చెందిన 10 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడి చేశాయి. ఫీనిక్స్ పలుచోట్ల వెంచర్స్, రియల్ ఎస్టేట్ ఇన్ ఫ్రాలో పెట్టుబడులు పెట్టింది. అయితే, ఫీనిక్స్ వెనుక కేటీఆర్(KTR) ఉన్నారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సంస్థలో కేటీఆర్ పెట్టుబడులు ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకే ఆ సంస్థకు పలుచోట్ల తక్కువ ధరకే భూములు కట్టబెట్టారని, అతివేగంగా అనుమతులు మంజూరయ్యాన్న ప్రచారం జరిగింది.
ఫీనిక్స్ సంస్థ చైర్మన్ చుక్కపల్లి సురేశ్(Phoenix Chairman Chukkapalli Suresh)కు, కేటీఆర్కు దగ్గరి సంబంధం ఉందని చెబుతారు. ఫీనిక్స్ కు ప్రయోజనం కలిగేలా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోని వందలాది ఎకరాల భూములను ప్రభుత్వం ఫీనిక్స్ గ్రూప్ నకు అప్పనంగా అప్పగించిందన్న ప్రచారం కూడా ఉంది. అదే ఫీనిక్స్ గ్రూప్ దాదాపు 1.50 లక్షల కోట్ల వ్యాపారం చేస్తుందని తెలుస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు రావడంతో ఐటీ విభాగాన్ని పురమాయించింది. స్థానిక అధికారులను కాకుండా ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలను పంపింది. అప్పటి దాడులే బీజేపీ ముందు బీఆర్ఎస్ సాగలబడడానికి కారణమన్న వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.
Phoenix | కీలక గుట్టు కేంద్రం చేతికి..
అనేక వక్రమార్గాల్లో ఫీనిక్స్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, అదే సమయంలో భారీగా ఐటీ ఎగువేసిందని సమాచారం రావడంతో చేసిన దాడుల్లో ఆదాయపన్ను శాఖ దాడులు కీలక గుట్టంతా కేంద్రం చేతికి చిక్కింది. ఫీనిక్స్ అక్రమాలు(Phoenix Crimes), అందులో ఉన్న రాజకీయ పెద్దల అక్రమ బాగోతం, నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన భూములు, అనుమతుల వివరాలు ఐటీ శాఖకు దొరికినట్లు ప్రచారం జరిగింది.
ముఖ్యంగా అప్పటి ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన మంత్రికి సంబంధమున్న 22 కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్లు సమాచారం. అన్ని ఆధారాలు, సాక్ష్యాలతో సహా దొరికిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కేంద్రం ముందు మోకారిల్లాల్సి వచ్చిందని తెలిసింది. 2022 ఆగస్టు తర్వాతే బీఆర్ఎస్ వైఖరిలో మార్పు వచ్చిందన్న విషయం రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అప్పటిదాకా కేంద్రంపై రుసరుసలాడిన కేసీఆర్.. ఆ తర్వాత నుంచి తన వాయిస్ తగ్గించారు. బీజేపీని నేరుగా విమర్శించడం ఆపేశారు.
Phoenix | కవిత చెప్పింది కూడా అదే..
బీఆర్ఎస్ జుట్టు చేతికందడంతో కేంద్రంలోని బీజేపీ కేసీఆర్ను ఫిక్స్ చేసే పనిలో పడింది. అప్పటికే జాతీయ పార్టీగా ఎదగాలనుకుంటున్న కేసీఆర్.. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. తొలుత మహారాష్ట్రలో పాగా వేయాలన్న ఆలోచనతో అక్కడ ఒకటి, రెండు సభలు కూడా పెట్టారు. అప్పటికే అప్పటికే భారీగా సంపద పోగేసిన కేసీఆర్(KCR).. అవసరమైతే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఫండింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారని ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ అప్పట్లో చెప్పడం దేశ రాజకీయాల్లో కలకలం రేపింది.
దీంతో కేసీఆర్(KCR)కు చెక్ పెట్టేందుకు సిద్ధమైన కేంద్రం ఫీనిక్స్ అంశాన్నిముందుకు తెచ్చింది. అదే సమయంలో లిక్కర్ స్కామ్లో కవిత పీకల్లోతుల్లో కూరుకుపోయింది. దీంతో కలవరపడిన కేసీఆర్ బీజేపీలో విలీనానికి సిద్ధపడ్డారన్న ప్రచారం జరుగుతోంది. కవిత గతేడాది మార్చిలో అరెస్టు అయ్యారు. ఆ తర్వాతే విలీన ప్రతిపాదన అంశంపై చర్చ జరిగింది. ఇదే అంశాన్ని కవిత తాజా వ్యాఖ్యలు బలపరుస్తున్నాయి. తాను జైలులో ఉండగానే బీజేపీలో బీఆర్ఎస్ను కలపాలన్న ప్రతిపాదన వస్తే తాను తిరస్కరించానని, అందుకే తనను కేసీఆర్కు దూరం చేస్తున్నారని చెప్పడం అందులో భాగమేనన్న విశ్లేషణ వినిపిస్తోంది.
Phoenix | మోదీ ఆనాడే చెప్పారు..
గతేడాది తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ (Prime Minister Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్(KTR)ను ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ తనతో చెప్పారని, ఇందుకు తన ఆశీర్వాదం కావాలని అప్పట్లో మోదీ వెల్లడించారు. ఫీనిక్స్ గుట్టుతో పాటు కవిత అరెస్టుతో వెనక్కు తగ్గిన కేసీఆర్.. పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారని, అందులో భాగంగానే తన కొడుకును ముఖ్యమంత్రిని చెయాలని అడిగారన్న ప్రచారం జరిగింది. మోదీ చెప్పిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మొత్తంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి సిద్ధపడిందన్న వాదనలు అప్పటి పరిణామాలతో పాటు కవిత వ్యాఖ్యలు రూఢీ చేస్తున్నాయని చెబుతున్నారు.