అక్షర టుడే, వెబ్ డెస్క్:Navodaya Nizamabad | నిజామాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ జవహార్ నవోదయ విద్యాలయం (Jawahar Navodaya Vidyalayam) ఈ ఏడాది నుంచే ప్రారంభం కానుంది. 2025 -26 విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని నవోదయ విద్యాలయ సమితి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఆరో తరగతిలో ప్రవేశాలు ప్రారంభించనుంది. తాజా నిర్ణయం ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చనుంది.
నవోదయ విద్యాలయం(Navodaya Vidyalayam)లో ఆరో తరగతిలో చేరితో 12వ తరగతి (ఇంటర్) వరకు ఇక్కడే పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ప్రతిష్టాత్మక నవోదయ విద్యాలయాల్లో చదివిన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. అందుకే నవోదయ విద్యాలయాల్లో సీట్లకు విపరీతమైన పోటీ ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న నవోదయలో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించాలని అధికారులు ఆదేశించారు. ఇందులో భాగంగా విద్యాలయాల శాశ్వత, తాత్కాలిక స్థలాలకు సంబంధించి అవసరమైన చర్యలు ప్రారంభించాలని నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ ప్రభుత్వానికి లేఖ రాశారు.
నిజామాబాద్ జిల్లా(Nizamabad District)లో శాశ్వత భవన నిర్మాణానికి జక్రాన్ పల్లి మండలం కలిగోట్ గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 1063లో 30 ఎకరాల భూమిని నవోదయ విద్యాలయ సమితి పేరిట బదలాయింపు చేసుకోవాలని సూచించారు. తాత్కాలిక వసతి కొరకు నాగారం శివారులోని ప్రభుత్వ డైట్ కళాశాల (Government Diet College) ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా తాత్కాలిక భవనాల్లో రోడ్లు, నీరు విద్యుత్, టెలికమ్యూనికేషన్ లాంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి విద్యా సంస్థ తాత్కాలిక భవనంలో ప్రారంభమయ్యేందుకు అవసరమైన మరమ్మతుల పనుల స్థితిపై నివేదిక అందజేయాలని జవహర్ నవోదయ విద్యాలయ నిజాంసాగర్ ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.
Navodaya Nizamabad | ఎంపీ అర్వింద్ చొరవతో..
నిజామాబాద్ జిల్లాలో నవోదయ విద్యాలయం ఏర్పాటు కావడం వెనుక బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(BJP MP Dharmapuri Arvind) చొరవ ఉంది. ఆయన పట్టుబట్టి మరీ తన పార్లమెంట్ పరిధిలో రెండు విద్యాలయాలను సాధించారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. నిజామాబాద్కు కేటాయించిన నవోదయ విద్యాలయం ఎక్కడ స్థాపించాలన్నది మొదట్లో వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనే నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయించుకోవాలని యత్నించారు. అయితే, అర్వింద్ తన రాజకీయ చతురతతో వివాదానికి ఫుల్స్టాప్ పెట్టారు. బోధన్లోనే ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి (MLA Sudarshan Reddy) తొలుత పట్టుబట్టారు. అయితే, జిల్లాకు ఒకవైపు ఉండే బోధన్ కాకుండా విద్యార్థులకు అందరికీ అందుబాటులో ఉండేలా నిజామాబాద్ రూరల్ నియోజవకర్గంలోని జక్రాన్పల్లి మండలం కలిగోట్(Jakranpally Mandal Kaligot)లో ఏర్పాటు చేసేందుకు అందరినీ ఒప్పించారు.
ఈ విషయంలో అర్వింద్(MP Arvind) చూపిన చొరవకు ప్రశంసలు వచ్చాయి. బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నప్పటికీ వారి నియోజకవర్గాల్లో కాకుండా విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో నవోదయను స్థాపించడానికి అర్వింద్ నిర్ణయించడం అందరినీ ఆకట్టుకుంది. రాజకీయ లబ్ధి కోసం కాకుండా కేవలం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించిన ఆయన వైఖరి విమర్శకుల నోళ్లు మూయించింది. మరోవైపు, నవోదయ విద్యాసంస్థ మంజూరు చేయించడంతో పాటు ఈ సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమయ్యేలా చొరవ తీసుకోవడంతో పాటు తాత్కాలిక భవన మరమ్మతుల కొరకు తన ఎంపీ నిధుల ద్వారా రూ.20 లక్షలు మంజూరు చేశారు. ఇందుకు గాను జిల్లా ప్రజలు అర్వింద్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
Navodaya Nizamabad | డైట్ కాలేజీలో తాత్కాలిక వసతి..
కేంద్రం కేటాయించిన నవోదయ విద్యాలయం నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కలిగోట్లో విద్యాలయం ఏర్పాటు కానుంది. అయితే శాశ్వత భవనాలు అందుబాటులోకి వచ్చే వరకూ తాత్కాలికంగా నాగారం శివారులోని ప్రభుత్వ డైట్ కళాశాలలో తరగతులు నిర్వహించనున్నారు. ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించనున్నారు. ఇటీవల నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహించగా, తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. నిజాంసాగర్ విద్యాలయంలో కటాఫ్ ర్యాంక్ తర్వాతి వారికి కలిగోట్ నవోదయ(Kaligot Navodaya)లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో రెండు సెక్షన్లు ప్రారంభం కానున్నాయి. ఒక్కో సెక్షన్లో 40 మంది చొప్పున 80 మందికి అవకాశం లభిస్తుంది. అయితే, ఆయా సీట్లను రోస్టర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. కాగా.. ఇటీవలే ప్రవేశ పరీక్షలు ముగిసి రిజల్ట్స్ కూడా వచ్చాయి.
Navodaya Nizamabad | జిల్లా విద్యార్థులకెంతో మేలు..
ప్రతిష్టాత్మక జవహార్ నవోదయ విద్యాలయం (Jawahar Navodaya Vidyalayam) జిల్లాలో ఏర్పాటు కావడం వల్ల స్థానిక విద్యార్థులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. పేదింటి విద్యార్థులకు ఇక్కడ చదువుకునే అవకాశం లభిస్తుంది. ఒకప్పుడు నవోదయ పాఠశాల అంటే కేవలం నిజాంసాగర్(Nizamsagar) పేరు మాత్రమే వినిపించేది. అలాంటిది ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోనూ మరొకటి ఏర్పాటు కావడం, అదనంగా 80 సీట్లు అందుబాటులోకి రావడంతో విద్యార్థులకు ప్రయోజనం దక్కనుంది. నవోదయలో ప్రవేశాలకు తీవ్రమైన పోటీ ఉంటుంది. పరిమిత సీట్ల కోసం విద్యార్థులు పోటీ పడుతుంటారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో మరో విద్యాలయం అందుబాటులోకి రావడం గర్వించదగ్గ విషయం.