అక్షరటుడే, వెబ్డెస్క్:MLC Kavitha | కేసీఆర్ కుటుంబంలో అంతర్గతంగా గూడు కట్టుకున్న అసమ్మతి బయటకు రావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీఆర్ఎస్(BRS)లో నెలకొన్న ఆధిపత్య పోరు రోడ్డు మీద పడడం, కవిత(Kavitha), కేటీఆర్(KTR) మధ్య ఏర్పడిన చిచ్చు తారస్థాయికి చేరడం చర్చనీయాంశమైంది. నేరుగా విమర్శలు చేసుకునేంత దూరం పెరిగింది.
అన్నాచెల్లెళ్ల మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడిందని తాజా పరిణామాలతో అర్థమవుతోంది. రేవంత్రెడ్డి(Revanth Reddy) కోవర్టులని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన కవిత.. “తనను కాంగ్రెస్ కోవర్ట్ అన్నారు. మరి బీఆర్ఎస్లో బీజేపీ కోవర్టులు(BJP coverts) ఉన్నారనుకోవాలా?” అని వ్యాఖ్యానించడం వారి మధ్య పెరిగిపోయిన దూరాన్ని ఎత్తి చూపుతోంది.
బీజేపీని గంపగుత్తగా అప్పగించే కుట్ర జరుగుతోందని ఆమె తన సోదరుడ్ని ఉద్దేశించి అనడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గురువారం మీడియా ప్రతినిధులతో చేసిన చిట్చాట్గా మాట్లాడిన కవిత.. అనేక సంచలన విషయాలు వెల్లడించారు. కేసీఆర్కు అంతర్గతంగా రాసిన లేఖ బయటకు ఎలా వచ్చిందన్న కవిత.. కాంగ్రెస్, బీజేపీ మీద పోరాడమంటే తనపై దాడికి దిగితే ఎలా? అని ప్రశ్నించారు. సొంత పార్టీ వాళ్లే కుట్ర ప్రకారం తనను ఎన్నికల్లో ఓడించారని వెల్లడించారు.
సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని, ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా మాట్లాడితే అలా మాట్లాడతారా? అని నేరుగా కేటీఆర్ను ఉద్దేశించే వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. బీజేపీ నేతలకు చెందిన హాస్పిటల్స్ ప్రారంభోత్సవాలకు వెళ్ళింది ఎవరో అందరకీ తెలుసునంటూ.. పార్టీలోని అగ్రనేతలను ఆమె పరోక్షంగా విమర్శించడం అటు బీర్ఎస్లో కలకలం రేపింది.
MLC Kavitha | కేటీఆర్ను లక్ష్యంగా చేసుకునే..
నేరుగా కేటీఆర్ను లక్ష్యంగా చేసుకునే మాట్లాడినట్లు కవిత వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. కేసీఆర్(KCR) దేవుడంటూనే, ఆయన పక్కన దెయ్యాలున్నాయని ఆమె చేసిన ఇటీవల వ్యాఖ్యలు కేటీఆర్(KTR)నుద్దేశించే అన్నట్లు స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన కమిషన్ నోటీసులు ఇస్తే.. పార్టీ వ్యవహరించిన తీరును కవిత ఎత్తి చూపారు. పెద్ద నేతలుగా ఊహించుకునే వారు ఎందుకు స్పందించ లేదని నిలదీశారు. కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వదిలేస్తే ఎలా? అని నేరుగా కేటీఆర్ను ఉద్దేశించే ఆమె వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక్కరే తన నాయకుడని, ఆయన నాయకత్వంలో తప్ప ఇతరుల నాయకత్వంలో తాను పని చేయనని తేల్చి చెప్పడం వెనుక తన సోదరుడిపై ఉన్న ఆగ్రహాన్ని కవిత వెల్లగక్కారు.
MLC Kavitha | ఎక్కడ చెడింది?
వాస్తవానికి కేటీఆర్, కవిత అత్యంత సన్నిహితంగా మెలిగే వారు. చిన్ననాటి నుంచి మొదలు తెలంగాణ(Telangana) ఉద్యమ సమయంలో కలిసే పోరాడారు. ప్రభుత్వంలోకి వచ్చిన తొలి ఐదేళ్లలోనూ కలిసి మెలిసి ఉన్నారు. అయితే, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతే అన్నా చెల్లి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వంలో, పార్టీలో కేటీఆర్కే పెత్తనం ఇవ్వడం, అన్నింట్లోనూ సోదరుడికి పెద్దపీట వేసి తనకు ప్రాధాన్యత తగ్గించడంపై కవిత నొచ్చుకున్నారు. పదవుల విషయంలో, ఆస్తుల పంపకాల విషయంలోనూ తనకు అన్యాయం జరిగిందన్న ఆవేదన కవిత మదిలో ఎప్పటి నుంచో ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మొదటి ఐదేళ్ల పాలనలో కేటీఆర్, కవిత మాటకు ప్రభుత్వంలో ఎదురులేకుండా పోగా, ఆ తర్వాతి నుంచే పరిణామాలు మారిపోయాయి.
2018లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో(Parliamentary Elections) కవిత అనూహ్యంగా ఓడిపోయారు. అయితే, ఎమ్మెల్యేలు కావాలనే సహకరించలేదని, కావాలనే ఓడించారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఇదే అంశాన్ని కవిత తాజాగా ప్రస్తావిస్తూ.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే.. నిజామాబాద్ ఎంపీ(Nizamabad MP)గా తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్య నాయకుడి సూచన మేరకే అప్పట్లో ఎమ్మెల్యేలు సహాయక నిరాకరణ చేశారన్న ప్రచారం జరిగింది. దీంతో గత కొన్నేళ్ల నుంచే అన్నాచెల్లి మధ్య ఆధిపత్య కొనసాగుతోందన్న విషయం అర్థమవుతోంది.
MLC Kavitha | పార్టీలోనూ చెల్లని మాట..
మరోవైపు, పార్టీలోనూ కవితకు ప్రాధాన్యం తగ్గిపోయింది. ఒకప్పుడు ఆమె మాటకు ఎదురే లేకుండా పోగా, తర్వాతి కాలంలో ఆమె మాటను పట్టించుకునే వారే కరువయ్యారు. కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన తర్వాతే తన ఆధిపత్యానికి గండి పడిందన్న అసంతృప్తి కవితలో గూడు కట్టుకుపోయింది. పార్టీ పదవుల నియామకం నుంచి మొదలు ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక వరకూ ఆమె మాటకు విలువ లేకుండా పోయింది. మరోవైపు, ప్రభుత్వంలోనూ ఆమె మాట చెల్లుబాటు కాకుండా పోయింది. లిక్కర్ స్కామ్(Liquor Scam) తర్వాత అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ కవిత ప్రాధాన్యం తగ్గిపోయింది. దీని వెనుక తన సోదరుడే ఉన్నారని గుర్తించిన ఆమెలో అసహనం పెరిగిపోయింది. తాజాగా విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కవితలో గూడు కట్టుకున్న అసంతృప్తిని ఎత్తి చూపాయి.
తనకు నీతులు చెబుతోన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు.. దమ్ముంటే కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీపై మీ ప్రతాపం చూపించాలంటూ సవాల్ విసిరారు. క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు చేయకుండా.. ట్వీట్టర్లో మెసేజ్లు పెడితే సరిపోతాయా? అంటూ ఆమె తన సోదరుడ్ని ఆక్షేపించారు. తాను అసలే మంచి దాన్ని కాదని.. తాను నోరు విప్పితే తట్టుకోలేరని కవిత చేసిన హెచ్చరిక నేరుగా కేటీఆర్(KTR)ను ఉద్దేశించనదేనన్న బహిరంగ సత్యం.
తాను జైలులో ఉన్నప్పుడే.. బీజేపీలో బీఆర్ఎస్ను కలపొద్దని కేసీఆర్(KCR)ను కోరానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. తొందరపాటు నిర్ణయం వద్దని జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్కు సూచించానన్నారు. ఆరు నెలలు కాదు.. సంవత్సరాలు అయినా జైల్లో ఉంటానని కేసీఆర్కు తాను స్పష్టం చేశానని కవిత ఈ సందర్భంగా వివరించారు.
MLC Kavitha | నాపై పడి ఏడుస్తున్నారు..
బీజేపీ నేతలకు చెందిన హాస్పిటల్స్ ప్రారంభోత్సవాలకు వెళ్ళింది ఎవరో అందరకీ తెలుసునంటూ.. పార్టీలోని అగ్రనేతలను ఆమె పరోక్షంగా విమర్శించారు. తన లేఖ లీక్ చేసిందెవరు తేల్చమంటే.. తనపై పడి ఏడుస్తున్నారంటూ మండిపడ్డారు. పదవులు కోరినట్లు తనపై పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించారన్నారు. కేసీఆర్(KCR) లెక్క.. తాను చాలా తిక్కదానినని ఆమె పునరుద్ఘాటించారు. వెన్నుపోటు రాజకీయాలు తను రావని.. సూటిగా మాట్లాడుతానని కుండ బద్దలు కొట్టారు.
MLC Kavitha | మహాభారతం క్యారెక్టర్లు..
సామాజిక తెలంగాణ(Telangana) సాధన కోసం తాను పోరాడుతానన్నారు. మా వాళ్ళు కొందరు.. సోషల్ మీడియాలో మహాభారతం క్యారెక్టర్లు వేస్తున్నారంటూ వ్యంగ్యంగా అన్నారు. వారు స్థాయికి మించి ఊహించుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. వరంగల్ సభ తమ వలనే సక్సెస్ అయిందని కొందరు ఊహించుకుంటున్నారన్నారు. కేసీఆర్ను మోసేంత పెద్ద వాళ్ళు అయిపోయామని వారంతా భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
MLC Kavitha | ఎమ్మెల్యేలే ఓడించారు..
జైలు వెళ్ళేటప్పుడు పార్టీకి, పదవికి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ వద్దంటేనే తాను ఈ పదవిలో కొనసాగుతున్నానన్నారు. సీఎంగా ఉండగా చంద్రబాబు (Chandrababu) తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నారన్నారు.
MLC Kavitha | సీఎం చంద్రబాబు ఏమి చేసినా..
ఏపీ సీఎం చంద్రబాబు ఏమి చేసినా.. కేంద్రం అడ్డుకోవటం లేదని ఒకింత అసహనాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇప్పటికీ గోదావరి నదీ జలాలు పంపకం సరిగా జరగలేదన్నారు. ఏపీ చేపట్టనున్న బనకచర్ల ప్రాజక్టుతో తెలంగాణ(Telangana)కు తీరని నష్టం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
MLC Kavitha | కేసీఆర్కు నోటీసులు ఇస్తే..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన కమిషన్ నోటీసులు(Kaleswaram Commission Notices) ఇస్తే.. పార్టీ ఎందుకు కార్యాచరణ తీసుకులేదని పార్టీలోని అగ్రనేతలను ఆమె సూటిగా ప్రశ్నించారు. పెద్ద నేతలుగా ఊహించుకునే వారు ఎందుకు స్పందించ లేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో తాను చేరటానికి ప్రయత్నం చేశాననటం అబద్దమన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని ఈ సందర్భంగా కవిత అభివర్ణించారు. తన పార్టీ బీఆర్ఎస్.. తన నాయకుడు కేసీఆర్ అంటూ కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో కేసీఆర్ మాత్రమే తన నాయకుడని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ తప్ప.. ఇతర నేతల నాయకత్వంలో తాను పనిచేయనని కుండబద్దలు కొట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న వారిని గౌరవిస్తానని కవిత పేర్కొన్నారు.