అక్షరటుడే, హైదరాబాద్: Panchayat elections : పల్లెల్లో రాజకీయ సమరానికి తెర లేవనుంది. జూన్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే పంచాయతీ పాలకవర్గాల (Panchayat governing bodies) పదవీ కాలం ముగిసింది. కానీ అప్పట్లో ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కారు సుముఖత చూపలేదు. ప్రత్యేకాధికారులను నియమించి ఏడాది కాలంగా పల్లె పాలన(village administration)ను నెట్టుకొస్తోంది. అయితే, వివిధ పథకాల అమలుతో తమకు సానుకూల వాతావరణం నెలకొందని భావిస్తున్న ప్రభుత్వం.. వచ్చే నెలలో ఎన్నికలలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. దీంతో జూన్ మొదటి రెండో వారంలో ఎలక్షన్ కోడ్(Election Code) అమల్లోకి రావొచ్చని తెలిసింది. జూలైలోపు ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Panchayat elections : విడుతల వారీగా ఎన్నికలు..
రాష్ట్రంలో 33 జిల్లాల్లో 10 వేలకు పైగా పంచాయతీలు ఉన్నాయి. అన్నింటికీ ఒకే విడుతలో కాకుండా దశల వారీగా ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూన్ మొదటి వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ప్రత్యేకాధికారుల పాలనలో పల్లె పాలన కుంటుపడింది. ఈ నేపథ్యంలో జీపీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమైంది.
అయితే, ప్రస్తుతానికి పంచాయతీ ఎన్నికలకే పరిమితం కావాలని సర్కారు యోచిస్తోంది. పరిస్థితిని బట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎలక్షన్లపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. జూన్ మొదటి లేదా రెండో వారంలో ఎలక్షన్ కోడ్ అమలులోకి రానుండగా, జూలై లోపు పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలన్న ప్రణాళికతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Panchayat elections : పార్టీ బలోపేతంపై దృష్టి
ఎన్నికల ముందర అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress party) అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై నెలకొన్న వ్యతిరేకత హస్తం నేతలకు కలిసొచ్చింది. 2023 నవంబర్ మొదటి వారంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. వివిధ పథకాల అమలులో కొంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. దీంతో మొదట్లో స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహణకు ప్రభుత్వం వెనుకడుగు వేసింది.
అయితే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలతో పాటు ప్రభుత్వ పథకాలపై ప్రస్తుతం సానుకూల పవనాలు ఉన్నాయన్న భావనతో రేవంత్ సర్కారు.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ అంశంపై పార్టీ నేతలకు సమాచారమివ్వడంతో పాటు పార్టీ పటిష్టతకు చర్యలు చేపట్టింది. బూత్ స్థాయి మొదలు గ్రామాలు, వార్డుల వారీగా కమిటీలు, ఇన్చార్జీలు నియమించడంపై దృష్టి పెట్టింది. మరోవైపు, వివిధ పథకాల అమలుతో పాటు ఇందిరమ్మ ఇండ్ల (Indiramma houses) నిర్మాణాలను వేగవంతం చేసింది. లబ్ధిదారుల ఎంపికతో పాటు ఇండ్ల నిర్మాణాపైనే ప్రధానంగా ఫోకస్ చేసింది.
Panchayat elections : ఆవిర్భావ దినోత్సవ వేళ కీలక నిర్ణయాలు
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో అన్ని వర్గాలను మెప్పించేలా సర్కారు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి.. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రకటన చేయడంతో పాటు పింఛన్ల పెంపు తదితర నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం నిధుల సమీకరణపై ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
కాగా.. పంచాయతీ ఎన్నికల కోసం గతంలోనే శిక్షణ ఇవ్వడంతో పాటు సామాగ్రి కూడా సిద్ధం చేసింది. ఇక రావాల్సిందల్లా.. కేవలం ఎన్నికల సంఘం నుంచి పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ మాత్రమే..!