అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | మేడ్చల్ (Medchal) జిల్లా శేరిలింగంపల్లి (Sheri Lingampalli) మండలం చందానగర్లోని మైత్రేయినగర్లో కబ్జాకు గురైన పార్క్(Mythrei nagar park)ను హైడ్రా అధికారులు కాపాడారు. ఈ పార్కు స్థలాన్ని ప్లాట్లుగా చేసి కబ్జాదారుడు విక్రయించారు.
అనంతరం పలువురు కోర్టుకు వెళ్లడంతో ఆ స్థలం పార్క్దే అని నిర్ధారణకు వచ్చింది. అయినా సదరు కబ్జాదారులు లిటిగేషన్లతో వివాదం పరిష్కారం కాకుండా చూస్తున్నాడు. దీంతో స్థానికులు ప్రజావాణిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్కు (Hydraa commissioner) కు ఫిర్యాదు చేశారు. లే ఔట్ ప్రకారం పార్కు ఉండడంతో హైడ్రా చర్యలు తీసుకుంది. ముళ్ల పొదలతో పాటు ఎవరూ నివాసం లేని చిన్న షెడ్డులను తొలగించి పార్కును అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో మైత్రేయినగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎకరం పార్కును కబ్జాల చెర నుంచి విముక్తి చేయించి రూ.40 కోట్ల ఆస్తిని కాపాడారంటూ కొనియాడారు.
Hydraa | ఘట్కేసర్లో రోడ్డు ఆక్రమణల తొలగింపు
ఘట్కేసర్(Ghat Kesar) ఔటర్ రింగ్ రోడ్డు పక్కన సర్వీస్ రోడ్డుకు ఆనుకొని సర్వే నంబరు 559, 563, 566 లో జయపురి కాలనీ పేరిట 1968 లో లే-అవుట్ వేశారు. ఇందులో ఇరవై ఏళ్ల క్రితం కొందరు ప్లాట్లు కొనుగోలు చేశారు. లే ఔట్ ఉండగా.. దానిని వ్యవసాయ భూమిగా చూపించి కొందరు పాసు పుస్తకాలను సృష్టించారు.
రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి ఆ పాసు పుస్తకాలను రద్దు చేయించారు. అయినా కబ్జాదారులు ఈ భూమి తమదంటూ లే-అవుట్లో పబ్లిక్ రోడ్లను కబ్జా చేసి, గోడలు నిర్మించారు. ప్లాట్ల యజమానుల హైడ్రా ప్రజావాణిలో(Hydraa Prajavani)లో ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు రహదారులకు అడ్డుగా నిర్మించిన ప్రహరీలను బుధవారం తొలగించారు.