అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు డబ్బులు దండుకోవడమే ధ్యేయంగా పని చేస్తున్నారు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) జరుగుతున్నా భయపడటం లేదు.
తమ దగ్గరకు పనుల కోసం వచ్చిన వారిని లంచం(Bribe) పేరిట వేధిస్తున్నారు. తాజాగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (Family Member Certificate) కోసం ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏకంగా రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం కోసం అంతమొత్తం డిమాండ్ చేశాడంటే.. మిగతా పనుల కోసం సదరు అధికారి ఎంత తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్ (Hyderabad) ముషీరాబాద్ (Musheerabad) తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా(RI) భూపాల మహేష్ పని చేస్తున్నాడు. ఇటీవల తన దగ్గరకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం వచ్చిన ఓ వ్యక్తి వద్ద మహేష్ ఏకంగా రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. సదరు వ్యక్తి బతిమిలాడటంతో రూ.25 వేలకు ఒప్పుకున్నాడు. దీంతో బాధితుడు లంచం ఇవ్వడం ఇష్టంలేక చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆర్ఐ మహేశ్ బుధవారం సదరు వ్యక్తి నుంచి రూ.25 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ACB Trap | తీరు మారని అధికారులు
రాష్ట్రంలో ఇటీవల ఏసీబీ దూకుడు పెంచింది. అవినీతి అధికారుల పని పట్టడమే లక్ష్యంగా నిత్యం దాడులకు పాల్పడుతోంది. మరోవైపు ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది. గతంలో అధికారులంటే ప్రజలు భయపడేవారు. ప్రస్తుతం విద్య, సాంకేతికత పెరగడంతో ఉద్యోగులు చేయాల్సిన పనుల గురించి ప్రజలకు అవగాహన వచ్చింది. దీంతో లంచం అడిగిన వారిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో సగటను రోజుకు ఒక ఏసీబీ కేసు నమోదు అవుతోంది. అయినా అవినీతి అధికారుల్లో మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం.
ACB Trap | వరుస ఘటనలు
ఇటీవల ఖమ్మం సబ్ రిజిస్ట్రార్ అరుణ గిఫ్ట్ డీడ్ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.30 వేల లంచం డిమాండ్ చేసింది. ఈ కేసులో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్తో పాటు డాక్యుమెంట్ రైటర్ వెంకటేశ్ను అదుపులోకి తీసుకున్నారు.
నిర్మల్ జిల్లా కడెం తహశీల్దార్ ఆఫీస్లో పని చేసే సర్వేయర్ పవార్ ఉమాజీ భూమి హక్కు పత్రం అందించడానికి లంచం అడగ్గా బాధితుడు ఏసీబీకి పట్టించాడు.
ఒక వ్యక్తికి సంబంధించిన వాహనం, డీజే సిస్టంను విడుదల చేయడానికి లంచం తీసుకుంటూ ఇటీవల జగద్గిరిగుట్ట ఎస్సై శంకర్ ఏసీబీకి చిక్కాడు. ఇలా ఈ నెలలో దాదాపు ఏసీబీ 18 కేసుల్లో నిందితులను వల పన్ని పట్టుకుంది. అయినా లంచాలకు మరిగిన అధికారులు మారడం లేదు.
ACB Trap | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్ చేయాలని సూచించారు. 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే అవినీతి అధికారుల పని చెబుతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.