అక్షరటుడే, ఇందూరు: Nizamabad | యాసంగి సీజన్కు సంబంధించి వరి ధాన్యం (Rice grain) సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగాన్ని సీఎం రేవంత్రెడ్డితో (CM Revanth Reddy) పాటు మంత్రులు అభినందించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Batti Vikramarka), మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర మంత్రులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 8.19 లక్షల మెట్రిక్ వరి ధాన్యం సేకరణ పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ధాన్యాన్ని సైతం పూర్తిస్థాయిలో సేకరించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆదేశించారు. లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎవరైనా మిల్లర్లు, దళారులు రైతులను నష్టపర్చే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Nizamabad | పీడీయాక్ట్ అమలు చేయాలని ఆదేశాలు..
ముందస్తుగానే రుతుపవనాలు ప్రవేశించినందున తదనుగుణంగా ఖరీఫ్ సీజన్కు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ (PD Act) అమలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు అన్ని మండలాల్లో భూభారతి (bhubarathi) రెవెన్యూ సదస్సులు నిర్వహించేలా ప్రణాళికల రూపొందించుకోవాలని చెప్పారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఈనెల 28, 29 తేదీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన జరపాలని పేర్కొన్నారు.
Nizamabad | అధికారులకు కలెక్టర్ సూచనలు..
అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) జిల్లాలో ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 4.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించగా.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 8.19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిపి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు.
700 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టామని, కొనుగోలు పూర్తయిన నేపథ్యంలో 625 కేంద్రాలను మూసివేశామన్నారు. సన్న రకం ధాన్యం 7.25 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. దొడ్డు రకం 93.24 వేల మెట్రిక్ టన్నులు మాత్రమేనని వివరించారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి 10 లక్షల మంది రైతులకు వారి ఖాతాలో రూ.1,786 కోట్ల బిల్లుల చెల్లింపులు పూర్తయ్యాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయా గౌడ్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.