అక్షరటుడే, వెబ్డెస్క్ :Illegal Registrations | రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు(Sub-Registrar Offices) అక్రమాలు, అవినీతికి కేంద్రంగా మారాయి. అన్ని పత్రాలు సక్రమంగా ఉండి రిజిస్ట్రేషన్ కోసం వెళ్తున్న సామాన్యులను ఇబ్బందులు పెడుతున్న అధికారులు.. అక్రమార్కులకు మాత్రం యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ (Registration) చేసి ఇస్తున్నారు. సామాన్య ప్రజలను రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్న అధికారులు.. అక్రమ రిజిస్ట్రేషన్లు మాత్రం వేగంగా చేస్తున్నారు.
తాజాగా వికారాబాద్ జిల్లా తాండూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు(Tandur Sub-Registrar Office)లో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కార్యాలయంలో నాలుగు రోజుల వ్యవధిలో 300 రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. సాధారణంగా ఇక్కడ రోజుకు పదికి మించి డాక్యుమెంట్లు కావు. కానీ ఈనెల 12 నుంచి 18 మధ్య ఏకంగా 300 రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. ఇందులో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. భారీ మొత్తంలో సొమ్ము చేతులు మారినట్లు తెలుస్తోంది.
Illegal Registrations | మంత్రి ఆగ్రహం
తాండూర్ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని అధికారులంతా పూర్తి నివేదికతో మంగళవారం సాయంత్రం తన వద్దకు రావాలని ఆయన ఆదేశించారు. అనధికారిక డాక్యుమెంట్లను నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ ఎలా చేశారని మంత్రి ప్రశ్నించినట్లు సమాచారం. కాగా అక్రమ రిజిస్ట్రేషన్ల వెనక అధికార పార్టీ నేత ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అనధికారిక డాక్యుమెంట్లను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం. దీంతో సదరు అధికారులపై మంత్రి చర్యలు తీసుకుంటారా అని చర్చ జరుగుతోంది.
Illegal Registrations | గతంలో వైరాలో..
ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో సైతం గతంలో భారీగా అక్రమ రిజిస్ట్రేషన్లు(Illegal Registrations) చోటు చేసుకున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వివాదాస్పద భూములకు సంబంధించి ఒకే రోజు 64 రిజిస్టేషన్లు జరిగాయి. ఈ ఘటన జనవరిలో చోటు చేసుకుంది. దీంతో ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్ రామచంద్రయ్య(Sub-Registrar Ramachandraiah)ను సస్పెండ్ చేశారు. మిగతా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సైతం అనేక అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డాక్యుమెంట్ రైటర్లు, దళారులతో కుమ్మకై సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.
Illegal Registrations | నిజామాబాద్ జిల్లాలో సైతం
నిజామాబాద్ జిల్లాలో సైతం ఇటీవల ఓ కార్యాలయంలో పెద్దఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఒకేరోజు నాన్ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిబంధనలకు విరుద్ధంగా పూర్తి చేసినట్లు సమాచారం. నిషేధిత జాబితాలో ఉన్న.. ఇండస్ట్రియల్, అసైన్డ్ భూములకు సంబంధించి లింకులు ఉండడంతో దర్జాగా లావాదేవీలు పూర్తి చేసినట్లు సమాచారం. అలాగే నాలా లేని భూములను సైతం రిజిస్ట్రేషన్ చేసి పెట్టారని తెలుస్తోంది. కాగా.. ఈ వ్యవహారం ఇంకా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లలేదు.
Illegal Registrations | లంచం తీసుకుంటూ దొరికిన సబ్ రిజిస్ట్రార్
ఖమ్మ జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రార్ ఆఫీసులో పని చేసే సబ్రిజిస్ట్రార్ అరుణ(Sub-Registrar Aruna) లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి చిక్కింది. ఖమ్మం మండలానికి చెందిన ఓ వ్యక్తి తన రెండు ఎకరాల భూమిని కుమారుడి పేరిట గిఫ్ట్ డీడ్ చేయాలనుకున్నాడు. అందుకు సబ్ రిజిస్ట్రార్ అరుణ రూ.50 వేల లంచం డిమాండ్ చేసింది. చివరకు రూ.30 వేలు తీసుకునేందుకు ఒప్పుకుంది. ఈ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులకు(ACB Officers) ఫిర్యాదు చేశాడు. దీంతో వారు వల పన్ని రూ.30 వేల లంచం తీసుకుంటుండగా డాక్యుమెంట్ రైటర్ వెంకటేశ్ను రెడ్ హ్యాండెడ్గా పటుకున్నారు. సబ్రిజిస్ట్రార్ అరుణ, రైటర్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.