అక్షరటుడే, వెబ్డెస్క్ : Bhatti Vikramarka | రాష్ట్రంలో విద్యుత్ కార్మికుల సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా విద్యుత్ కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా(Accidental Insurance)ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం ప్రజాభవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ కార్మికుల కుటుంబాలకు ఆయన బీమా సొమ్ము అందజేశారు.
ఎన్పీడీసీఎల్(NPDCL) పరిధిలో విధులు నిర్వహిస్తూ జోగు నరేశ్ ప్రమాదవశాత్తు మరణించాడు. ఆయన కుటుంబ సభ్యులకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రూ.కోటి ప్రమాద బీమా చెక్కు అందించారు. మరో కార్మికుడు మృతి చెందగా.. ఆయన భార్యకు కారుణ్య నియామక ఉత్తర్వును అందజేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.
విద్యుత్ ఉద్యోగులు మరింత అంకితభావంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని భట్టి కోరారు. ప్రభుత్వ నిర్ణయాలను సక్రమంగా అమలు చేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు. ప్రమాదానికి గురైన కార్మికులకు, వారి కుటుంబాలకు అండగా ఉండేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు సంక్షేమ పాలనకు నిదర్శనం అని భట్టి విక్రమార్క అన్నారు. ఈ పథకాన్ని మొదట సింగరేణిలో ప్రవేశపెట్టి, తర్వాత విద్యుత్ సంస్థలకూ విస్తరించామని వివరించారు. కార్మికులకు రూ.కోటి బీమా ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు.