అక్షరటుడే, వెబ్డెస్క్: Congress | కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల (Congress district presidents) ఎంపిక కోసం అధిష్టానం కసరత్తు చేస్తోంది. పార్టీ కోసం పని చేసేవారికే పదవులు కట్టబెట్టాలని యోచిస్తోంది. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ఎంపికను పర్యవేక్షించేందుకు పలువురు పరిశీలకులను నియమిస్తోంది. తాజాగా మధ్య ప్రదేశ్, హర్యానాకు పరిశీలకులను నియమించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు (Telugu states) చెందిన నలుగురికి చోటు కల్పించింది. వీరు ఆయా రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికను పర్యవేక్షిస్తారు.
తెలంగాణ నుంచి ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ (AICC Secretary Sampath Kumar) మధ్యప్రదేశ్కు పరిశీలకుడిగా ఎంపికవ్వగా, వంశీ చంద్ రెడ్డి హర్యానాకు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ నేత గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ సెక్రటరీ సిరివెళ్ళ ప్రసాద్ మధ్యప్రదేశ్ పరిశీలకులుగా నియమించారు. త్వరలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు సైతం పరిశీలకులను నియమించనున్నారు. వారి పర్యవేక్షణలోనే నూతన కమిటీల ఎంపిక జరగనుంది.