అక్షరటుడే, వెబ్డెస్క్ : MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తులు, పదవుల పంపకాల్లో కవితకు, కేటీఆర్కు తేడాలు వచ్చాయని ఆయన ఆరోపించారు. దీంతోనే కవిత తన తండ్రికి లేఖ(Kavitha Letter) రాశారని పేర్కొన్నారు. కవిత మరో షర్మిల కాబోతుందుని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల కవిత తన తండ్రి కేసీఆర్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ క్రమంలో ఎంపీ లక్ష్మణ్ స్పందించారు.
MLC Kavitha | అన్నలు వదిలిన బాణాలు.. వారిపైనే గురిపెట్టాయి
ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. గతంలో వైఎస్(YSR) కుటుంబంలో కూడా ఆస్తులు, పదవుల పంపకాల్లో తేడా రావడంతో షర్మీల (Ys Sharmila) పార్టీ పెట్టిందని గుర్తు చేశారు. గతంలో అన్నలు వదిలిన బాణాలు.. ఇప్పుడు వారిపైనే గురి పెట్టాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్కు కవిత రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
MLC Kavitha | కవిత కుట్రలు పనిచేయవు
బీఆర్ఎస్లో కేటీఆర్(KTR leadership) నాయకత్వాన్ని కవిత వ్యతిరేకిస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అయితే పార్టీలో కవిత కుట్రలు పని చేయవని ఆయన అభిప్రాయపడ్డారు. పదేళ్లుగా సామాజిక న్యాయం గురించి కవిత మాట్లాడలేదని.. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్తో కలిసి కుట్ర చేస్తోందన్నారు. షర్మిలను కూడా కాంగ్రెస్ ఇలానే వాడుకుందని ఆయన ఆరోపించారు.
కేవలం తన సొంత ఉనికి కోసమే కవిత పోరాటం చేస్తున్నారని విమర్శించారు. మద్యం కుంభకోణం(Liquor Scam) కేసులో జైలుకు వెళ్లొచ్చిన కవితను ప్రజలు నమ్మరని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కవితకు సానుభూతి కూడా రాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ బలపడుతుండటంతోనే కాంగ్రెస్, కవిత కలిసి కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు.