అక్షరటుడే, వెబ్డెస్క్: MLC Kavitha | బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు (KCR) కాలం ఎదురు తంతోంది. పదేండ్లు.. చెప్పాలంటే పాతికేండ్లు తనను నెత్తి మీద పెట్టుకున్న తెలంగాణ (Telangana) సమాజం మొన్నటి ఎన్నికల్లో కిందకు లాగి పడేసింది.
అధికారంలో తేలిపోతున్న బీఆర్ఎస్ను నేలకు దించింది. అధికారం పోయిన వెంటనే గులాబీ దళపతి కిందపడడం, కాలు తుంటి విరిగిపోయి చాలాకాలం మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలనుకుంటున్న తరుణంలో తన సొంత కుటుంబంలోనే (Own Family) ఏర్పడిన సంక్షోభం కేసీఆర్కు కొత్త తలనొప్పి తెచ్చి పెట్టింది. కుటుంబంలో, బీఆర్ఎస్లో (Family and BRS Party) అన్నీ తానే అయి ఇన్నాళ్లు నడిపించిన ఆయన.. ఇప్పుడు కవిత రూపంలో తలెత్తిన ధిక్కార స్వరాన్ని ఏవిధంగా పరిష్కరిస్తారు? బిడ్డకు సర్దిచెప్పి సంక్షోభాన్ని నివారిస్తారా? లేక గతంలో ధిక్కార స్వరం వినిపించిన వారిని గెంటేసినట్లు బిడ్డను కూడా గెంటేస్తారా? అధికారం దూరమై, పార్టీతో పాటు ఇంట్లో రాజుకున్న రాజకీయ కుంపటిని కేసీఆర్ ఏ విధంగా చల్లారుస్తారన్న దానిపై ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలతో పాటు గులాబీ శ్రేణుల దృష్టి నెలకొంది.
MLC Kavitha | ఏకచత్రాధిపత్యం
బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్.. కేసీఆర్ (KCR) అంటేనే బీఆర్ఎస్ అన్నట్లు ఇన్నాళ్లు నడిచింది. ఆయన కనుసన్నల్లోనే పాతికేళ్లుగా పార్టీ ముందుకు నడిచింది. 2001లో టీఆర్ఎస్ (TRS Party) స్థాపించిన నాటి నుంచి పార్టీని అన్ని రకాలుగా నడిపించింది, శాసించింది కేసీఆర్ ఒక్కరే. తెలంగాణ (Telangana) ఉద్యమాన్ని తలకెత్తుకున్న నాటి నుంచి ఎంతో మంది వెంట నడిచినా, తర్వాతి కాలంలో ఆయనకు దూరమయ్యారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయనే దూరం పెట్టారు.
ఆలే నరేంద్ర నుంచి మొదలు పెడితే దేవేందర్గౌడ్, విజయశాంతి (Vijayashanthi), ఈటల రాజేందర్ (Etela Rajender) వరకూ ఎంతో మంది సీనియర్లు గులాబీ గూటి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. తెలంగాణ సిద్ధాంతకర్తలు ప్రొఫెసర్ జయశంకర్ (Professor Jayashankar), కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Lakshman Bapuji), ప్రొఫెసర్ కోదండరాం (Professor Kodandaram) వంటి వారు కూడా చివరకు ఒకానొక దశలో కేసీఆర్ వైఖరి నచ్చకుండా నొచ్చుకున్న వాళ్లే. కానీ, అప్పటికే తెలంగాణ ప్రజల్లో బలమైన ముద్ర వేసుకున్న గులాబీ బాస్కు (Gulabi Boss) ఇలాంటివి పెద్దగా తలనొప్పి తీసుకురాలేదు. బీఆర్ఎస్ లో ఏకఛత్రాధిపత్యాన్ని ఏలిన కేసీఆర్ తెలంగాణ సాధన తర్వాత మరింత బలపడ్డారు. పార్టీలో, ప్రభుత్వంలో తనకు ఎదురే లేకుండా పోయింది. ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయడం ద్వారా ఆయన రాష్ట్ర రాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకున్నారు.
MLC Kavitha | చీలిక తప్పదా?
పదమూడేళ్ల ఉద్యమం, పదేళ్ల ప్రభుత్వ ప్రస్థానం వెరసి బీఆర్ఎస్ తెలంగాణపై బలమైన ముద్ర వేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. యావత్ తెలంగాణ సమాజాన్ని (Telangana society) ఏకం చేసిన ఘనత కేసీఆర్ది మాత్రమే అనడంలోనూ ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అయితే, రెండోసారి అధికారంలోకి వచ్చాక అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో అంతర్గత సంక్షోభం మొదలైంది. బటయకు రాకపోయినా ఆధిపత్య పోరు కొనసాగింంది. కేసీఆర్ కుటుంబంలోనే (KCR family) చీలిక ఏర్పడింది.
కుర్చీ కోసం కేటీఆర్ నుంచి పోరు ఎక్కువైంది. మరోవైపు, అప్పటి ఎంపీ సంతోష్కుమార్ (MP Santosh Kumar) మాటే శాసనంగా ప్రభుత్వం నడిచింది. అది కాస్త కవిత రాజకీయ ఆశయాలకు గండి పడడం మొదలైంది. అదే సమయంలో లిక్కర్ స్కామ్లో (iquor scam) ఇరుక్కుని ఆమె జైలుకెళ్లడం, బయటకు వచ్చాక ఆమెకు పార్టీలో ప్రాధాన్యం తగ్గించడం జరిగి పోయింది. అప్పటికే తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న కవితకు ఈ పరిణామాలు నచ్చలేదు. అందుకే పార్టీని ప్రధానంగా కేసీఆర్ను ఇరుకున పెట్టేలా ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
వరంగల్ సభ (Warangal assembly) తర్వాత తన పరిస్థితి ఏమిటో కేసీఆర్ ముద్దుల తనయకు అర్థమైపోయింది. దీంతో ఆమె తన తండ్రికి లేఖాస్త్రం సంధించారు. కేసీఆర్కు రహస్యంగా రాసిన ఆ లేఖ బయటకు రావడం రాష్ట్ర రాజకీయాల్లో (state politics) కలకలం సృష్టించింది. ఆ తర్వాతి రోజే అమెరికా నుంచి వచ్చిన కవిత.. లేఖ (Letter) తానే రాశానని అంగీకరించారు. కేసీఆర్ దేవుడంటూనే, ఆయన పక్కన దెయ్యాలున్నాయని వ్యాఖ్యానించారు. తన తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తానని చెప్పారు. కానీ తర్వాతి రోజే కేటీఆర్ (KTR) విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కుటుంబంలో, పార్టీలో నెలకొన్న ఆగాధాన్ని వెల్లడించాయి. ఎవరైనా సరే పార్టీ అంతర్గత విషయాలను అంతర్గతంగానే మాట్లాడాలని.. బెదిరించే ధోరణిలో ఆయన మాట్లాడడంతో కేసీఆర్ కుటుంబంలో (KCR family), బీఆర్ఎస్లో చీలిక తప్పదనే విషయం దాదాపు ఖాయమై పోయింది.
MLC Kavitha | కేసీఆర్ ఎటువైపు?
ఇన్నాళ్లు తండ్రి కేసీఆర్కు ఆయన బిడ్డలు ఎదురు చెప్పలేదు. అటు కేటీఆర్ కానీ, ఇటు కవిత (KTR and Kavitha) గానీ ఆయన గీసిన గీత దాటలేదు. ముఖ్యమంత్రిని చేయాలని మధ్యలో కేటీఆర్ కొంత కొంత మారం చేసినప్పటికీ, అప్పటి పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత అంతా సర్దుమణిగినట్లే కనిపించింది. కానీ ఇప్పుడు కవిత (Kavitha) హఠాత్తుగా తండ్రికి ఇబ్బందులు సృష్టించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ముద్దుల తనయ తెచ్చిన సంక్షోభాన్ని కేసీఆర్ ఎలా సర్దుబాటు చేస్తారన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేసీఆర్ను కలిసి అన్ని విషయాలూ మాట్లాడతానని కవిత విలేకరులతో చెప్పారు. అయితే, ఆమె వైఖరితో ఆగ్రహంగా ఉన్న గులాబీ దళపతి బిడ్డను పిలిచి మాట్లాడతారా? ధిక్కార స్వరం వినిపించిన కవితకు సర్దిచెప్పి సమస్యను పరిష్కరిస్తారా? అలా చేస్తే మరోబిడ్డ కేటీఆర్ ఊరుకుంటారా? లేక గతంలో ధిక్కార స్వరం వినిపించిన వారిని బయటకు గెంటేసినట్లు కవితను కూడా పార్టీ నుంచి సాగనంపుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అన్నాచెల్లెళ్ల (ktr and kavitha issue) మధ్య పూడ్చలేనంత అగాధం పెరిగిపోయిన తరుణంలో కేసీఆర్ ఎటువైపు ఉంటారు.. కుమారుడి వైపు నిలుస్తారా? లేక కుమార్తెకు అండగా నిలుస్తారా? కాలమే నిర్ణయిస్తుంది. కానీ అప్పటిదాకా బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? కేసీఆర్ కింకర్తవ్యం ఏమిటి అన్న దానిపై అందరి దృష్టి నెలకొంది.