అక్షరటుడే, ఆర్మూర్/నిజాంసాగర్: Mansoon Rains | నాలుగైదు రోజులుగా కురస్తున్న వర్షాల కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జలాశయాల్లోకి స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ (Sriramsagar), నిజాంసాగర్లలో (Nizamsagar) క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి (Sriramsagar Project) ఎగువన వానలు కురుస్తుండడంతో స్వల్ప వరద ప్రారంభమైంది. ఎగువ నుంచి 2,789 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.965 టీఎంసీలుగా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 7.488 టీఎంసీలు నిల్వ ఉంది.
Mansoon Rains | ఆయకట్టు రైతుల హర్షం..
మే మాసంలోనే వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్ట్లోకి నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్ట్ కింద ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ప్రాజెక్ట్ నిండుకుండలా మారగా.. యాసంగి పంటలకు డిసెంబర్ 25నుంచి ఏప్రిల్ 15 వరకు శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ పరిధిలోని 6 లక్షల ఎకరాలకు 62 టీఎంసీల నీటిని అందించిన విషయం తెలిసిందే.
Mansoon Rains | అక్టోబర్ 29 వరకు బాబ్లీగేట్లు ఓపెన్..
జూలై 1 నుండి అక్టోబర్ 29 వరకు బాబ్లీ గేట్లు (Babli Gates) తెరిచి ఉంటాయి. ప్రస్తుత వర్షాల కారణంగా స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 60 టీఎంసీలకు చేరిన తర్వాత ఖరీఫ్ పంటల సాగుకు నీటి విడుదలపై ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.
Mansoon Rains | నిజాంసాగర్లోకి స్వల్పంగా ఇన్ఫ్లో..
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ నుంచి స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. తాజాగా 1,076 క్యూసెక్కుల వరద వచ్చిందని ప్రాజెక్ట్ ఏఈఈ శివ శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 5.567 టీఎంసీల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.