అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | బీఆర్ఎస్(BRS) లో నెలకొన్న ముసలంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీలో అంతర్గత విషయాలపై అంతర్గతంగానే మాట్లాడాలని వ్యాఖ్యానించారు. కేసీఆర్కు కవిత లేఖ రాయడంపై స్పందించిన ఆయన అందులో తప్పేమీ లేదని చెప్పారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో కేటీఆర్(KTR) శనివారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ తీవ్ర కలకలం రేపుతున్న అంశంపై ఆయన స్పందించారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు, కుట్రదారులు ఉన్నాయన్న కవిత వ్యాఖ్యలపై ఆయన పరోక్షంగా వార్నింగ్ ఇచ్చే రీతిలో మాట్లాడారు. పార్టీ అంతర్గత విషయాలను బయట మాట్లాడటం సరికాదన్నారు. అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు. సమయం వచ్చినప్పుడు కోవర్టులు వారంతట వారే బయటపడతారని కవిత వ్యాఖ్యలను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు. పార్టీలో అందరం కార్యకర్తలమేనని.. అందరం సమానమే అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువన్నారు. కేసీఆర్కు లేఖలు రాయడం సహజమేనని.. కేసీఆర్కు సూచనలు చేయాలంటే ఎవరైనా లేఖలు రాయొచ్చు అని మాజీ మంత్రి అన్నారు.
KTR | కాంగ్రెస్పై తీవ్ర ఆరోపణలు..
కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Chief Minister Revanth Reddy)పై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అధిష్టానానికి డబ్బులు పంపిస్తూ రేవంత్రెడ్డి తన పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald case)లో రేవంత్ పేరు ఉండటం తెలంగాణ సమాజానికే అవమానమన్నారు. రేవంత్ది సీటుకు రూటు కుంభకోణమంటూ విమర్శించారు. ఓటుకు నోటు కుంభకోణం ఇంకా ఎవరూ మర్చిపోలేదని.. యంగ్ ఇండియా పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ పీసీసీ పదవి కొనుక్కున్నారని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి(Komatireddy Venkat Reddy) స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. రేవంత్కు బ్యాగ్మాన్ అనే పేరు ఎప్పుడో వచ్చిందన్నారు. రేవంత్రెడ్డికి ఢిల్లీలో ఇద్దరు బాస్లు ఉన్నారని, ఒకరు రాహుల్గాంధీ(Rahul Gnadhi), మరొకరు మోదీ(PM Modi) అని ఆరోపించారు. ఈడీ చార్జిషీట్లో సీఎం రేవంత్రెడ్డి పేరు ఉందని, దీనిపై రేవంత్, రాహుల్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చార్జిషీట్లో పేరు ఉన్నందుకు రేవంత్రెడ్డి ఎందుకు రాజీనామా చేయడం లేదని నిలదీశారు. గతంలో ఆరోపణలు వచ్చిన ముఖ్యమంత్రులు, మంత్రులు తన పదవుల నుంచి తప్పుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు.
KTR | ఏటీఎంలా తెలంగాణ
ఢిల్లీ కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎం(ATM)లా మారిందని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ మాటలు, మూటల ముఖ్యమంత్రి అంటూ దుయ్యబట్టారు. మూటలు పంచి రేవంత్ తన పదవిని కాపాడుకుంటున్నారని.. తనని తాను కాపాడుకునేందుకు ఢిల్లీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. రేవంత్కు ఢిల్లీలో ఇద్దరు బాస్లు ఉన్నారని.. 16 నెలల్లో 44 సార్లు ఢిల్లీ వెళ్లి అరుదైన రికార్డ్ సాధించారంటూ ఎద్దేవా చేశారు. గతంలో తెలంగాణలో ట్రిపుల్ ఆర్ టాక్స్ నడుస్తోందన్న ప్రధాని మోదీ(Prime Minister Modi).. దానిపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డిని కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వమేనని ఆరోపించారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా చేసిన అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు.
KTR | అమిత్ షా కాళ్లు పట్టుకున్న రేవంత్..
రేవంత్రెడ్డి నిన్న రాత్రి చీకట్లో అమిత్షా (Amit Shah)కాళ్లు పట్టుకున్నారని.. అరెస్ట్ చేయొద్దని ఈడీకి చెప్పాలని వేడుకున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాయితీ ఉంటే సీఎం పదవి నుంచి రేవంత్ తప్పుకోవాలని.. లేదంటే ఢిల్లీ పెద్దలే రేవంత్ను తప్పించాలని డిమాండ్ చేశారు. అవినీతి సీఎంను ఎందుకు కొనసాగిస్తున్నారో రాహుల్ చెప్పాలన్నారు. కాంగ్రెస్ డీఎన్ఏ(Congress DNA)లోనే అవినీతి ఉందంటూ ఆరోపించారు. యావత్ దేశం ముందు తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్తో బీజేపీ కుమ్మక్కు అయిందని ఆరోపించారు.
KTR | బీజేపీ ఎందుకు స్పందించదు?
ఈడీ ఛార్జ్షీట్(ED charge sheet)లో రేవంత్ పేరున్నా కేంద్రంలోని బీజేపీ(BJP) ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీకి నిజాయితీ ఉంటే తెలంగాణలో స్కామ్లపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో స్కామ్లపై కేంద్ర ఏజెన్సీలు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ అవగాహనతో నడుస్తున్నాయన్నారు. పొంగులేటి ఇంట్లో ఈడీ తనిఖీలు జరిగి ఏడాదైందని.. తనిఖీల వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను బీజేపీ నేతలు ఎందుకు కాపాడుతున్నారని అడిగారు. వాల్మీకి స్కాం(Valmiki scam)లో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రూ.45 కోట్లు వచ్చాయని.. ఈ స్కామ్లో నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నెలరోజుల్లోగా రేవంత్ అవినీతిపై స్పందించకపోతే ప్రత్యక్ష కార్యచరణకు దిగుతామంటూ కేటీఆర్ కేంద్రానికి డెడ్లైన్ విధించారు. గవర్నర్ను కలిసి విచారణ జరపాలని కోరతామని చెప్పారు. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, దెయ్యం రేవంత్రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ దెయ్యాన్ని, శనిని వదిలించడమే తమ పని అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు.