అక్షరటుడే, వెబ్డెస్క్: DK Aruna | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) రాసిన లేఖ ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ లేఖలో కవిత తన తండ్రిని పలు ప్రశ్నలు అడిగారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీ(BJP) గురించి కేవలం రెండు నిమిషాలే మాట్లాడారని.. దీంతో భవిష్యత్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం జరుగుతోందన్నారు. కాగా.. ఎమ్మెల్సీ కవిత లేఖపై బీజేపీ ఎంపీ డీకే అరుణ(BJP MP DK Aruna) స్పందించారు. కవిత తన తండ్రికి రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందని ఆమె ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని డీకే అరుణ అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ చాలా బలహీనపడిందని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ పార్టీతో కవితకు మంచి సంబంధాలు ఉన్నాయని డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బీజేపీ బలపడుతుండడంతో కవిత లేఖ రాశారని విమర్శించారు.
కాగా.. కవిత(Kavitha) లేఖ రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తుందని, అందుకు కవిత లేఖ నిదర్శనమని పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. రానున్న రోజుల్లో కవిత సొంత కుంపటి పెట్టుకుంటారని పేర్కొంటున్నారు. మరి దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.