అక్షరటుడే, వెబ్డెస్క్: MLC Kavitha | బీఆర్ఎస్ పార్టీ(BRS Party)లో కొన్నాళ్లుగా గూడు కట్టుకున్న అసంతృప్తి బద్దలైంది. పార్టీ అధినేత కేసీఆర్(KCR)కు సొంత కుటుంబం నుంచే అభిశంసన ఎదురైంది. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తన తండ్రికి రాసిన లేఖ గులాబీ శ్రేణులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. సొంత పార్టీ వ్యవహార శైలిపై, కన్న తండ్రి తీరుపై ఆమె సంధించిన ప్రశ్నల వర్షం రాజకీయ ప్రత్యర్థులకు బ్రహ్మాస్త్రాన్ని అందించినట్లయింది. అసలు కవిత సొంత పార్టీపై ఎందుకు తిరుగుబాటు చేశారు? కన్న తండ్రినే ప్రశ్నిస్తూ ఎందుకు లేఖాస్త్రం సంధించారు? పార్టీ అధినేతకు రహస్యంగా రాసిన లేఖ బయటకెలా వచ్చింది? కావాలనే లీక్ చేశారా? కవితను పొమ్మన లేక పొగ బెడుతున్నారా? లేక పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని ఆమె ఆవేదన వెల్లగక్కారా? లేక సొంత కుంపటి పెట్టుకోవడానికే తిరుగుబావుటా ఎగురువేశారా? ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్నలివి.
MLC Kavitha | మంచి వాగ్ధాటి..
ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందారు. అమెరికా(America)లో ఉన్నత చదువులు చదివిన ఆమె తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీలో అనర్గళంగా మాట్లాడగలిగిన విశిష్ట నాయకురాలు. తన వాగ్ధాటితో పాటు వివిధ అంశాలపై ఆమెకు మంచి పట్టుంది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రజలను కదిలించడంలో కేసీఆర్(KCR) వారసత్వాన్ని ఆమె పుణికి పుచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, బీఆర్ఎస్ పాలనలోనూ కవిత తనదైన ముద్ర వేశారు.
MLC Kavitha | సొంతగా ఎదిగిన నేత..
తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత సొంతంగా ఎదిగారు. కనుమరుగై పోతున్న బతుకమ్మ(Bathukamma)ను బతికించిన నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యమ సమయంలో మన సంస్కృతి సంప్రదాయాలను ఆధారంగా చేసుకుని ఉద్యమానికి కొత్త రూపు తీసుకురావడంలో బతుకమ్మ ఎంతో కీలకంగా మారింది. ఒకనాడు తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ విశిష్టతను ప్రపంచం నలుమూలలా చాటి చెప్పడంలో కవిత(MLC Kavitha) కృషి ఎంతో ఉంది. కవిత అంటే బతుకమ్మ.. బతుకమ్మ అంటే కవిత అన్న రీతిలో ప్రచారం జరిగింది. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో బతుకమ్మకు విశిష్ట స్థానం దక్కింది. స్వరాష్ట్రంలోనూ బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించడం వెనుక కవిత కృషి ఉంది. ఊరూవాడ తిరుగుతూ బతుకమ్మలు పేర్చుతూ మహిళా లోకాన్ని ఏకం చేసిన నాయకురాలిగా ఆమెకు మంచి పేరొచ్చింది.
MLC Kavitha | లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని..
తెలంగాణ రాష్ట్రం(Telangana State) సిద్దించిన తర్వాత బీఆర్ఎస్ అధికారం చేపట్టాక కవితకు విశేష ప్రాధాన్యం దక్కింది. నిజామాబాద్ ఎంపీగా గెలుపొందిన ఆమె.. పసుపుబోర్డు సహా వివిధ అంశాలపై కేంద్రంపై పోరాడారు. తొలి ఐదేళ్లు తనదైన శైలిలో రాజకీయాల్లో రాణించారు. పార్టీలో, ప్రభుత్వంలో ఆమె మాటకు తిరుగు లేకుండా పోయింది. అయితే, ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో కవిత ఓడిపోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్(BRS) అధికారంలో ఉన్నప్పటికీ ఆమె ఓటమిని మూటగట్టుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అప్పటికే ప్రభుత్వంలో బలమైన నేతగా ఎదిగిన కవిత.. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంతో చేతులు కలిపి లిక్కర్ స్కామ్(Liquor Scam)కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సౌత్ లాబీతో చేతులు కలిపి ఢిల్లీ మద్యం కుంభకోణానికి తెర లేపారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ కేసులో కవిత అరెస్టు కావడం బీఆర్ఎస్కు మింగుడు పడలేదు. మద్యం కుంభకోణంలో ఓ మహిళ ఇరుక్కోవడంతో కవిత ఇమేజ్ దారుణంగా పడిపోయింది. మరోవైపు, ఇది గులాబీ పార్టీకి తీవ్ర నష్టం కలిగించింది. 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో ఊహించని రీతిలో ఆ పార్టీ ఓడిపోయింది. అధినేత కేసీఆర్ సహా పార్టీ శ్రేణులకు అసెంబ్లీ ఫలితాలు షాక్ తగిలించాయి.
MLC Kavitha | క్రమంగా దూరం పెట్టిన పార్టీ..
లిక్కర్ స్కామ్(Liquor Scam)లో ఇరుక్కున్న తర్వాత బీఆర్ఎస్ కవితను క్రమంగా దూరం పెట్టడం మొదలైంది. కేటీఆర్ను రాజకీయ వారసుడిగా బలంగా ముందుకు తీసుకొచ్చిన కేసీఆర్.. కవితకు పార్టీలో ప్రాధాన్యం తగ్గించారని గులాబీ శ్రేణులే చెబుతున్నాయి. లిక్కర్ స్కామ్లో అరెస్టయి జైలుకు వెళ్లిన కవితను బయటకు తీసుకొచ్చేందుకు కేసీఆర్.. బీజేపీ(BJP) ముందు చేతులు చాచాల్సి వచ్చిందని చెబుతారు. అందుకే మొదట్లో కాషాయ పార్టీపై రుసరుసలాడిన ఆయన.. కవిత ఉదంతం తర్వాత బీజేపీపై విమర్శల దాటిని తగ్గించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, తనను జైలుపాలు చేసిన బీజేపీపై గుర్రుగా ఉన్న కవితకు.. బీఆర్ఎస్ మౌనం మరింత అసహనం కలిగించింది. ఒకవైపు పార్టీలో ప్రాధాన్యం తగ్గించడం, నాయకులతో యాక్సెస్ కట్ చేయడం, తన ఆశలకు వ్యతిరేకంగా సోదరుడ్ని భావి నాయకుడిగా ప్రోత్సహించడంపై ఆమె కొన్నాళ్లుగా అంతర్గతంగా రగిలి పోయారు. తన రాజకీయ ఆశలు, ఆశయాలపై నీళ్లు చల్లుతూ కేటీఆర్(KTR)ను కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం చేయడంపై కవిత కుమిలిపోయారు.
MLC Kavitha | సొంతకుంపటి సాధ్యమేనా?
బీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా కొంతకాలంగా పోరాటం చేస్తున్న కవితకు పార్టీ నుంచి మద్దతు కరువైంది. ఇదే అంశాన్ని ఆమె తన తండ్రికి రాసిన లేఖలో ఎత్తిచూపారు. పార్టీ శ్రేణులతో తనకు యాక్సెస్ లేకుండా చేస్తుండడాన్ని ఆమె ప్రశ్నించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా నొచ్చుకున్న కవిత.. తిరుగుబావుటా ఎగురవేశారు. తన తండ్రిని అభిశంసిస్తూ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కవిత దారెటు? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సొంత పార్టీలో ఇమడలేక పోతున్న ఆమె.. కొత్త పార్టీ పెట్టుకుంటారన్న చర్చ జరుగుతోంది. కవిత లాగే తీవ్ర అసంతృప్తితో ఉన్న హరీశ్రావు(Harish Rao) కూడా బీఆర్ఎస్ను వీడతారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం ఎంత కష్టపడినా తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని, కేటీఆర్ను ప్రమోట్ చేస్తూ తనను తొక్కేస్తున్నారన్న అసంతృప్తితో ఆయన ఉన్నారని అనుచరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే హరీశ్రావు, కవిత బీఆర్ఎస్ను వీడుతారని, ఇద్దరు కలిసి కొత్త పార్టీ స్థాపిస్తారన్న భావన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఘోరంగా వైఫల్యం చెందింది. పదేళ్ల పాలన తర్వాత బీఆర్ఎస్ను జనం నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు అంతర్గత కలహాలు ఆ పార్టీని మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయి. మంచి అవకాశమున్నప్పటికీ బీజేపీ అందిపుచ్చుకోలేక పోతోంది. ఇలాంటి తరుణంలో కొత్త పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని కవిత యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకన్న రాజకీయ శూన్యతను పూరించడం ద్వారా మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, పార్టీని స్థాపించినప్పటికీ, దాన్ని నడపడం అంతా ఈజీ కాదన్న విషయాన్ని కవిత గుర్తించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.