అక్షరటుడే, వెబ్డెస్క్: Bharath – Turkey | పాకిస్తాన్(Pakistan)కు వంత పాడుతున్న టర్కీ(Turkey)కి భారత్ గురువారం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. సీమాంతర ఉగ్రవాదానికి(Cross-border terrorism) మద్దతు ఇవ్వడం మానేసి, పాకిస్తాన్ సంవత్సరాలుగా ఆశ్రయం ఇస్తున్న ఉగ్రవాద వ్యవస్థపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని టర్కీ పొరుగు దేశాన్ని గట్టిగా కోరుతుందని ఆశిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. “సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానేసి, దశాబ్దాలుగా అది(పాక్) పెంచుతున్న ఉగ్రవాద వ్యవస్థపై విశ్వసనీయమైన, ధ్రువీకరించదగిన చర్యలు తీసుకోవాలని టర్కీ పాకిస్థాన్ను గట్టిగా కోరుతుందని మేము ఆశిస్తున్నామని” విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్(Randhir Jaiswal) న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో పేర్కొన్నారు.
Bharath – Turkey | పాక్కు మద్దతుగా నిలిచిన టర్కీ
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) జరుగుతున్న సమయంలో పాకిస్తాన్కు టర్కీ అన్ని రకాలుగా అండగా నిలబడింది. టర్కీ సైనిక సహకారం కూడా అందించింది. అలాగే, ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరులో భాగంగా పాకిస్తాన్(Pakistan)పై దాడి చేస్తే, దాన్ని తప్పుబట్టింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్కు బహిరంగంగానే వంత పాడింది. ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లో పహల్గామ్ ఉగ్రవాద దాడి(Pahalgam terror attack)కి ప్రతీకారంగా సరిహద్దు వెంబడి ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై భారత్ చేసిన దాడులను టర్కీ నిస్సిగ్గుగా ఖండించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మన విదేశాంగ కార్యదర్శి టర్కీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక సంబంధాలు పరస్పర గౌరవం ఆధారంగా ఉండాలని తెలిపారు.
Bharath – Turkey | చర్చల ప్రసక్తే లేదు..
పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునే దాకా, జమ్మూకశ్మీర్లో అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతాలను అప్పగించేదాకా ఆ దేశంతో చర్చలు ఉండవని జైస్వాల్ స్పష్టం చేశారు. అలాగే, న్యూఢిల్లీ పంపిన జాబితాలో పేర్కొన్న ఉగ్రవాదులను అప్పగించకపోతే పాకిస్తాన్తో ఎటువంటి చర్చలు జరగవని తేల్చి చెప్పారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు కాబట్టి సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసినట్లు ఆయన పునరుద్ఘాటించారు. ‘భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షికంగా ఉండాలనే మా వైఖరి అందరికీ బాగా తెలుసు. అదే సమయంలో, చర్చలు, ఉగ్రవాదం కలిసి ఉండవని గుర్తు చేయాలనుకుంటున్నాను. ఉగ్రవాదం విషయంలో కొన్ని సంవత్సరాల క్రితం పాకిస్తాన్కు అందించిన ప్రముఖ ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించడం గురించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జమ్మూకశ్మీర్పై ఏదైనా ద్వైపాక్షిక చర్చ జరగాలంటే పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని అప్పగించాలని మాత్రమే చెప్పాలనుకుంటున్నానని” ఆయన అన్నారు.