అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | కామారెడ్డి ప్రజలు వర్షం అంటే వణికిపోతున్నారు. కొద్దిపాటి వాన పడిందంటే చాలు పట్టణం(kamareddy town)లో వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. చిన్నపాటి వానకే పలు కాలనీల్లోకి వరద నీరు ముంచెత్తుతుంది. డ్రెయినేజీలు (drainages) సక్రమంగా లేక కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకుంటున్నాయి. తిరిగి వర్షాకాలం సీజన్ మొదలైన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రం(kamareddy town) రోజురోజుకు విస్తరిస్తోంది. కానీ అందుకు తగినట్లు వసతులు పెరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం కావడంతో పట్టణ రూపురేఖలు మారిపోతాయని, సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు భావించారు. కానీ, ఇప్పటికీ డ్రెయినేజీలు (drainages) సక్రమంగా నిర్మించకపోవడంతో వానాకాలంలో పలు కాలనీలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి. ఇళ్లలోకి వరద నీరు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
Kamareddy | నీట మునుగుతున్న కాలనీలు
పట్టణంలోని విద్యానగర్, అశోక్ నగర్, బతుకమ్మ కుంట కాలనీలు ఏటా వానాకాలంలో నీట మునుగుతున్నాయి. వరద నీరు వెళ్లే మార్గం లేక ఇళ్లలోకి నీరు చేరుతోంది. డ్రెయినేజీ నీరు (Drainage water), వరద నీరు ఇళ్లలోకి చేరగా.. ప్రజలు ఈ సీజన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం కురిసిన ప్రతీసారి నిజాంసాగర్ చౌరస్తా వద్ద రోడ్డుపై నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
Kamareddy | ఏళ్లుగా పరిష్కారం శూన్యం
కామారెడ్డి మున్సిపాలిటీలో (Kamareddy Municipality) ఏడు గ్రామాల విలీనంతో పట్టణం మరింత విస్తరించింది. కానీ వరద నీటి సమస్య (water problem) పరిష్కారానికి మాత్రం అధికారులు చర్యలు చేపట్టడం లేదు. పట్టణంలో అరగంట పాటు వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో అడుగు లోతులో వరద నీరు నిలుస్తోంది. ఈసారి ముందస్తు వర్షాలు మొదలయ్యాయి. అయినప్పటికీ.. ఆయా ప్రాంతాల్లో ఇప్పటి వరకు వరద కాల్వల నిర్మాణం చేపట్టలేదు. దీంతో ఈ సీజన్లో కూడా తమకు వరద నీటితో ఇబ్బందులు తప్పవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.