అక్షరటుడే, వెబ్డెస్క్ : Cabinet | రాష్ట్ర మంత్రివర్గం state cabinet లో విభేదాలు తారాస్థాయికి చేరాయి? కేబినెట్లో ఆధిపత్య పోరు కొనసాగుతోందా? మంత్రులు గ్రూపులుగా విడిపోయారా? రేవంత్ సర్కారులో అంతర్గతంగా ఏం జరుగుతోంది? కాంగ్రెస్ హైకమాండ్ మదిలో ఏముంది? ఇప్పుడివే రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న హాట్హాట్ చర్చలు. రాష్ట్ర మంత్రివర్గం రెండుగా చీలిపోయిందన్న ప్రచారం కొన్నాళ్లుగా జోరుగా సాగుతోంది. రేవంత్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా వీడిపోయి ఒకరిపై, మరొకరు లీకులు ఇచ్చుకుంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. మంత్రి కొండా సురేఖ minister konda surekha వ్యాఖ్యలు అందులో భాగమేనన్న భావన వ్యక్తమవుతోంది. కొందరు మంత్రులు డబ్బులు తీసుకుని ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారన్న కొండా సురేఖ.. యథాలాపంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, దాని వెనుక బలమైన ఆధిపత్య పోరే కారణమని చెబుతున్నారు. ఏయే మంత్రులైతే రేవంత్రెడ్డిని cm revanth reddy టార్గెట్గా చేసుకుని పని చేస్తున్నారో వారిని లక్ష్యంగా చేసుకునే కొండా వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
Cabinet | కుర్చీ కోసం ఆరాటం
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ congress అంటేనే కప్పల తక్కెడ అని నానుడి. పార్టీలో ఎవరూ ఎదుగుతున్నా వారిని కిందకు లాగడం ఇక్కడ సహజం. ఆధిపత్య పోరుకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్. ఏమైనా అంటే అది అంతర్గత ప్రజాస్వామ్యమని చెబుతారు. పార్టీలో ఉంటూనే పార్టీకి నష్టం చేస్తున్నా హైకమాండ్ ఏమీ అనదు. అలాంటి పార్టీలో కలహాలు కామనే కదా. ఇప్పుడదే వైఖరి కేబినెట్లోనూ కనిపిస్తోంది. సీనియర్ మంత్రుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అనతి కాలంలోనే పార్టీలో చేరి ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిన రేవంత్పై సహజంగానే కొందరికి అక్కసు ఉంది. అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆయనను దించి గద్దెనెక్కేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటున్నారు. పాలనలో రేవంత్రెడ్డికి సహకరించక పోగా, ప్రభుత్వంపై వచ్చే ఆరోపణలను తిప్పికొట్టడంలో అనాసక్తి చూపుతున్నారు. పైగా పార్టీ పరువు పోతుందంటూ హైకమాండ్కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు.
Cabinet | ప్రస్ఫుటంగా ఆధిపత్య పోరు
మంత్రిమండలిలో లుకలుకలు ఉన్నాయన్నది వాస్తవం. కొందరు మంత్రులు ministers తమకు నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారన్నదీ అంతే సత్యం. రేవంత్ సర్కారు వేస్తున్న అడుగులకు కొందరు సీనియర్లు అడ్డు పడుతున్నారన్నది కూడా వాస్తవం. ఆధిపత్య పోరు కారణంగా మంత్రిమండలి విస్తరణ cabinet expansion, పార్టీలో సంస్కరణలు నిలిచిపోయాయి. కేబినెట్లో విభేదాలపై అటు ప్రతిపక్షాలు సైతం దుమ్మెత్తి పోస్తున్నాయి. రేవంత్, భట్టి మధ్య తీవ్ర విభేదాలున్నాయని బీజేఎల్పీ నేత bjlp leader మహేశ్వర్రెడ్డి maheswar reddy తాజాగా ఆరోపించారు. రాష్ట్ర మంత్రివర్గం రెండుగా చీలిపోయిందని,రాష్ట్రం దివాలా తీసిందని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మంత్రివర్గం అసంతృప్తిగా ఉందని ఆయన చెప్పారు. రేవంత్ కారణంగా మళ్లీ అధికారంలోకి రావడం కష్టమేనన్న భావన మంత్రుల్లో ఉందన్నారు. మంత్రివర్గ విస్తరణను రేవంతే అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు, బీఆర్ఎస్ brs నేతలు మంత్రుల మధ్య పొరపొచ్ఛలు ఉన్నాయని, వారే రేవంత్రెడ్డిని కిందకు లాగేస్తారని చెబుతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు సహా గులాబీ నేతలంతా ఇదే తరహాలో వ్యాఖ్యానిస్తున్నారు.
Cabinet | చీలిపోయిన సహచరులు
మంత్రిమండలిలో దాదాపు అందరూ సీనియర్లే ఉన్నారు. ఒక్కొక్కరికి రాజకీయంగా పదిహేనేళ్లకు పైగానే సీనియారిటీ ఉంది. మరికొందరికైతే మూడు దశాబ్దాల దాకా అనుభవం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ను ఓడించడం దాదాపు అసాధ్యమనుకునే భావన సరికాదని నిరూపించిన ఘనత ఆయా నాయకుల సొంతం. కనుమరుగైందనుకున్న కాంగ్రెస్ను కష్టపడి విజయ తీరాలకు చేర్చిన ఘనత కూడా వారి సొంతమే. అధికారంలోకి వచ్చేదాకా కలిసి పని చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు విడిపోయారు. మంత్రివర్గంలో ఉంటూనే వర్గాలుగా విడిపోయి పార్టీని, ప్రభుత్వాన్ని బద్నాం చేయడంలో ముందున్నారు. కలిసి కట్టుగా ప్రతిపక్షాలను ఎదుర్కొంటూ, ప్రజలకు మంచి పాలన అందించాలన్న సోయి మరిచి ఎవరికి వారే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ బతకాలన్నా, ప్రభుత్వం నడవాలన్నా మంత్రివర్గ సహచరులు కలిసి నడిస్తేనే సాధ్యమని సూచిస్తున్నారు. అది కాదని ఆదిపత్యానికి పోతే, కుర్చీ కోసం ఆరాటపడితే ఉన్న అధికారం కూడా పోతుందన్న వాస్తవాన్ని విస్మరించొద్దని హితవు పలుకుతున్నారు.