అక్షరటుడే, వెబ్డెస్క్: Surveyor Posts | ప్రభుత్వం రాష్ట్రంలోని భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ధరణి పోర్టల్(Dharani Portal) స్థానంలో భూ భారతిని ప్రవేశపెట్టింది. ఇప్పటికే పలు మండలాల్లో భూ భారతి(Bhu Bharati) అమలులోకి వచ్చింది. అయితే సర్వేయర్ల కొరతతో అనేక భూ సమస్యలు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించింది. ప్రస్తుతం మూడు నాలుగు మండలాలకు ఒక సర్వేయర్ ఉన్నారు. దీంతో ప్రతి మండలానికి సర్వేయర్ను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ కోసం దరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది.
Surveyor Posts | ఐదు వేల మంది సర్వేయర్ల భర్తీ
రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు వేల మంది సర్వేయర్లను(Surveyors) భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం మొదట శిక్షణ ఇచ్చి అనంతరం విధుల్లోకి తీసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే శిక్షణ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మే 5 నుంచి 17 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో మీ సేవ కేంద్రాల ద్వారా ఇప్పటికే వేలాది మంది లైసెన్స్డ్ సర్వేయర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Surveyor Posts | ఫీజు ఎంతంటే..
లైసెన్స్డ్ సర్వేయర్(Licensed Surveyor) పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదటి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షన అనంతరం వారిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు ప్రభుత్వం(Government) తెలిపింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొత్తం 50 రోజులు శిక్షణ ఇస్తారు. శిక్షణ కోసం ఓసీ అభ్యర్థులు రూ.పది వేలు, బీసీ అభ్యర్థులు రూ.ఐదు వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,500 ఫీజు కట్టాలి. మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.వంద ఫీజు చెల్లించాలి.
Surveyor Posts | వీరే అర్హులు..
లైసెన్స్డ్ సర్వేయర్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఎంపీసీలో 60 శాతం మార్కులు వచ్చిన వారు అర్హులు. ఐటీఐ డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్), డిప్లొమా (సివిల్), బీటెక్ (సివిల్) చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను శిక్షణ ఇచ్చిన అనంతరం ఉద్యోగాల్లోకి తీసుకోనున్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసి, సర్వేయర్ల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే శిక్షణ తర్వాత ఉద్యోగాల్లోకి అభ్యర్థులను ఎలా తీసుకుంటారనే విషయంపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఐదు వేల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు శిక్షణకు వస్తే.. ఎలా ఎంపిక చేస్తారనే సందేహం నెలకొంది. దీనికి ప్రత్యేకంగా ఏదైనా పరీక్ష పెడతారా.. లేకపోతే శిక్షణ సమయంలోనే అర్హులను గుర్తిస్తారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.