అక్షరటుడే, వెబ్డెస్క్: Buddha Jayanti : అహింసో పరమో ధర్మః అని అహింసా వాదాన్ని ప్రచారం చేసిన బుద్ధుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేడు(మే 12న) వైశాఖ పౌర్ణమి. మహా వైశాఖి Maha Vaisakhi గా పేర్కొనే నేటి బుద్ధ పూర్ణిమ Buddha Purnima ను బుద్దుని జన్మదినంగా నిర్వహించుకుంటాం. ఈ రోజు భారత్తోపాటు ప్రపంచ దేశాల్లోని బౌద్ధులంతా ఎంతో ఘనంగా వేడుక చేసుకుంటారు. ఉత్తరాదిన బుద్ధ పౌర్ణమిని మహా వైశాఖి అనే పేరుతో పిలుచుకుంటారు.
Buddha Jayanti : వైశాఖ పూర్ణిమకు బుద్దుడికి సంబంధం ఏంటంటే..
బుద్దుడి జీవితంలో వైశాఖ పౌర్ణమి రోజునే మూడు సార్లు ముఖ్యమైన ఘటనలు జరిగాయి. అందుకే బుద్ధుడి జీవితంలో వైశాఖ పౌర్ణమికి అంత ప్రాధాన్యం ఉంది. కపిలవస్తు రాజు శుద్ధోధనుడు, మహామాయలకు వైశాఖ పౌర్ణమి నాడు సిద్ధార్థుడు(బుద్ధుడు) జన్మించాడు. వైశాఖ పూర్ణిమ రోజునే సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా అవతరించాడు. వైశాఖ పౌర్ణమి నాడే ఆయన నిర్యాణం చెందాడు.
Buddha Jayanti : గౌతముడు ఎలా అయ్యాడంటే..
బుద్ధుడికి చిన్నతనంలోనే తల్లి మరణించింది. దీంతో గౌతమి అనే మహిళ బుద్ధుడుని పెంచింది. అందుకే ఆ మహా పురుషుడికి గౌతముడని పేరు వచ్చింది. సత్యాన్వేషణలో దేశాటన చేస్తూ.. చివరకు గయలోని బోధి వృక్షం కింద కోరికలే మానవుల దుఃఖానికి కారణమనే కఠోర సత్యం తెలుసుకుంటాడు. ఏ బోధి వృక్షం కింద బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిందో దానినే బుద్ధ పౌర్ణమి రోజున పూజించడం సంప్రదాయంగా వస్తోంది.
Buddha Jayanti : బోధి వృక్షానికి పూజలు మొదలయ్యాయి ఇలా..
బేతవన విహారంలో బుద్ధుడు బసచేసిన రోజుల్లో ఒకనాడు భక్తులు పూలు తీసుకొని వస్తారు. కానీ, ఆ సమయంలో గౌతమ బుద్ధుడు Gautama Buddha అక్కడ ఉండడు. అతడి కోసం ఎంతో సేపు ఎదురు చూసి, చివరికి భక్తులు తమ వెంట తెచ్చిన పూలను అక్కడే వదిలి వెళ్తారు.
బేతవన విహార దాత అయిన ఆనంద పిండకుడు Ananda Pindaka.. భక్తులు చేసిన పని చూసి, పూలు పూజకు వినియోగం కాకుండా వృథా కావడం నచ్చలేదు. అలా ఆయన బుద్ధుడితో మాట్లాడతాడు. గౌతముడు బయటకు వెళ్ళేటప్పుడు తన పాదుకలు, వస్తువులను వనంలో విడిచి వెళ్తే భక్తులు పూజలు చేసుకుంటారని సూచిస్తారు.
కాగా, విగ్రహారాధన, శరీర భాగాలకు పూజలు చేసే విధానానికి వ్యతిరేకి అయిన గౌతముడు.. భక్తులు తెచ్చిన పూలతో బోధి వృక్షానికి పూజలు చేయమని సూచిస్తాడు. అలా గయలోని బోధివృక్షం Bodhi tree in Gaya నుంచి విత్తనం తెప్పించి నాటుతారు. ఆనాడు జరిగిన మహా వేడుకకు కోసల దేశపు రాజు తన పరివారంతో వస్తారు. దేశవిదేశాల నుంచి వేలాది బౌద్ధ భిక్షవులు తరలివస్తారు. ఆనాటి నుంచి బోధి వృక్షానికి పూజ చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
అలా ఏటా వైశాఖ పూర్ణిమ రోజున బోధి వృక్షపూజ జరపడం ఆచారంగా వస్తోంది. వైశాఖ పౌర్ణమి రోజున బౌద్ధులు బోధి వృక్షానికి జెండాలు కడతారు. దీపాలు వెలిగించి పరిమళ జలం పోస్తారు.
Buddha Jayanti : నేడు ఏం చేస్తారంటే..
బౌద్ధ మతం అనుసరించేవారు బుద్ధ పౌర్ణమి రోజున గౌతముడి గౌరవార్థం బౌద్ధ పతాకం ఎగురవేస్తారు. ఎంతో నిష్ఠతో బౌద్ధ స్తూపాన్ని ప్రార్థిస్తారు. బౌద్ధ మత గురువులకు పువ్వులు, దీపాలు, అగరుబత్తుల వంటివి సమర్పిస్తారు. వాడిపోయే పువ్వులు, గాలిలో కలిసిపోయే అగరుబత్తీల సువాసన, ఆరిపోయే దీపాల వెలుగుల మాదిరే.. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని అర్థంగా వీటిని గురువులకు సమర్పించుకుంటారు.
Buddha Jayanti : బుద్ధ పౌర్ణమి రోజున ఇలా చేయాలి..
- హింసను ప్రేరేపించే మద్యం, మాంసాలు తీసుకోవద్దు.
- పశువులు, పక్షులు సహా ఏ జీవినీ హింసించకూడదు.
- పంజరాలలో బంధీగా ఉన్న పక్షులను స్వేచ్ఛగా వదిలేయాలి.
Buddha Jayanti : బౌద్ధాలయాల్లో Buddhist temples పూజలు ఇలా..
ఒక పాత్రలో నిండుగా నీళ్లు పోసి, అందులో పూలు వేస్తారు. వచ్చిన భక్తులు అందులో నీళ్లు పోస్తుంటారు. అలా చేయడం వలన పాపాలు నశిస్తాయని విశ్వాసం. ఇక సభలు, సమావేశాలు, ప్రార్థనలు, గౌతమ బుద్ధుడి జీవన సరళిని, బౌద్ధమతాన్ని చాటే ఉపన్యాసాలు, ఊరేగింపులు వేడుకగా నిర్వహిస్తుంటారు. బుద్ధ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తారు.