అక్షరటుడే, వెబ్డెస్క్: Jafar Express : పాకిస్తాన్(Pakistan) లోని బలూచిస్తాన్ ప్రాంతం(Balochistan region)లో జాఫర్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. సింధ్ ప్రావిన్స్ లోని జకోబాబాద్ దగ్గర రైల్వే ట్రాక్పై బాంబు పేలింది. దీంతో అదే సమయంలో అటుగా వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది.
రైలు పట్టాలపై ఐఈడీ (IED) బాంబు అమర్చడం వల్లే పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు తీవ్రతకు పట్టాల కింద సుమారు మూడు అడుగుల గొయ్యి ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. ఈ పేలుడుతో క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురై, ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
బలూచిస్తాన్ వేర్పాటువాదులు(Balochistan separatists) ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు గతంలోనూ దాడులకు గురైంది. గత మార్చి నెలలో పాకిస్తాన్లోని వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు ఇదే రైలును హైజాక్ చేసి, వందలాది ప్రయాణికులను బందీలుగా చేశారు. వారిని రక్షించేందుకు వెళ్లిన పాక్ భద్రతా సిబ్బందిని హతమార్చారు. తర్వాత పాక్ భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి బందీలను విడిపించాయి.
తాజాగా మళ్లీ అదే రైలు లక్ష్యంగా దాడి జరగడం కలకలం రేపింది. పాకిస్తాన్లో బలూచిస్తాన్ ప్రావిన్స్ అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఉంది. ఇక్కడ బలోచ్ ఆర్మీ(Baloch Army)కి గట్టి పట్టు ఉండటం గమనార్హం. పాక్ ప్రభుత్వ కార్యకలాపాలు ఇక్కడ చాలాకాలంగా జరగడంలేదు. ఇటీవలే తమది స్వతంత్ర దేశంగానూ బలోచ్ ఆర్మీ ప్రకటించుకుంది. కాగా, ఈ దాడికి సంబంధించి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.