అక్షరటుడే, వెబ్డెస్క్ : Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ (Ahmedabad) సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన (Air india flight) ప్రమాదంలో 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే బాధిత కుటుంబాలు తమ వారిని కోల్పోయిన వేదనతో విలవిల్లాడుతున్న వేళ, నిరాశ కలిగించే అంశం ఏంటంటే.. DNA పరీక్షల ప్రక్రియ ఆలస్యం అవుతుండడం. మృతదేహాలను గుర్తించడంలో జాప్యం జరుగుతున్న వేళ బాధిత కుటుంబాల ఆవేదన మరింత ఎక్కువైంది. కనీసం చివరి రూపం కూడా చూసుకోలేని పరిస్థితి వారిని మరింత ఆందోళనకి గురి చేస్తుంది.
Ahmedabad Plane Crash | ఫోరెన్సిక్ బృందాల నిరంతర కృషి
ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ప్రాసెస్ నెమ్మదిగా సాగుతుంది. అందుకు ప్రధాన కారణం ప్రమాద సమయంలో ఏర్పడిన అధిక ఉష్ణోగ్రతలేనని (high temperature) వైద్యులు తెలిపారు. గాంధీనగర్లోని ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్ హెచ్పీ సంఘ్వీ (H.P. Sanghvi) ప్రకారం ప్రమాద సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉండడంతో అగ్నిప్రమాదం తీవ్రత పెరిగిందన్నారు. ఈ కారణంగా మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయన్నారు. దీనివల్ల DNA నమూనాలను సేకరించడం సవాలుగా మారిందని తెలిపారు. అయితే మరణించిన వారిలో 31 మందిని డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించినట్టు సివిల్ ఆస్పత్రి అధికారులు (Civil Hospital officials) వెల్లడించారు. వీరిలో 12 మంది మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు తెలిపారు.
మిగిలిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని, వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ(Vijay roopani) మృతదేహాన్ని గుర్తించామన్నారు. డీఎన్ఏ ఆధారంగా భౌతికకాయం గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. విజయ్ రూపానీ భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో 13 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని కూడా ఆయన వెల్లడించారు. మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి, గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో, వాటిని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు తప్పనిసరి అయ్యాయి.