అక్షరటుడే, వెబ్డెస్క్ : Ahmedabad plane crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం (Ahmedabad plane crash ) తీరని విషాదం మిగిల్చింది. గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలోని అందరూ మృతి చెందారు. సిబ్బంది, పైలట్లు సహా మొత్తం 242 మంది చనిపోయారని సమాచారం. మృతుల్లో 169 భారతీయులు, 53 మంది బ్రిటీష్ వాసులు, ఏడుగురు పోర్చుగీస్, ఒక కెనడియన్ ఉన్నారు. ఇద్దరు శిశువులతో పాటు 13 మంది చిన్నారులు కూడా మృతి చెందారని సమాచారం. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని (Former Gujarat Chief Minister Vijay Rupani) సైతం ప్రమాదంలో చనిపోయారు.
Ahmedabad plane crash | క్షణాల్లోనే మంటలు వ్యాపించి..
అహ్మదాబాద్లో మధ్యాహ్నం టేకాఫ్ అయిన ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ కొన్ని క్షణాలకే కుప్పకూలి పోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్న ఈ విమానం చెట్టును ఢీకొని హాస్టల్పై పడడంతో భారీ విస్ఫోటనం జరిగింది. క్షణాల్లోనే మంటలు వ్యాపించి విమానం మొత్తం దగ్ధమైంది. ప్రమాదం సమయంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది మంటల్లో సజీవ దహనమయ్యారు. ప్రయాణికుల్లో ఎవరూ బతికే అవకాశం లేదని అహ్మదాబాద్ సీపీ వెల్లడించారు. మరోవైపు, ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన విషాదకరమైన విమానయాన సంఘటనలో గణనీయమైన సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం ధ్రువీకరించింది. అహ్మదాబాద్లో జరిగినది చాలా విషాదకరమైన ప్రమాదమని, చాలా మందిని కోల్పోయామని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఖచ్చితమైన వివరాలు బయటకు రావడానికి మనం సమయం పడుతుందని చెప్పారు.
Ahmedabad plane crash | డీఎన్ఏ టెస్ట్ చేశాక..
విమానం కూలిపోవడంతో మంటలు అంటుకొని పలువురి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో డీఎన్ఏ టెస్ట్ (DNA Test) చేశాక మృతదేహాలను అప్పగిస్తామని గుజరాత్ ఆరోగ్యశాఖ కార్యదర్శి వెల్లడించారు. ఘటనా స్థలం వద్ద అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
Ahmedabad plane crash | రాకపోకలు ప్రారంభం
విమాన ప్రమాదంతో మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. ప్రస్తుతం విమానాశ్రయంలో తిరిగి రాకపోకలు ప్రారంభమయ్యాయి. పరిమిత సంఖ్యలో విమానాల రాకపోకలను అనుమతిస్తున్నారు. ప్రమాదంతో మూడు గంటల పాటు ఎయిర్ పోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి.