అక్షరటుడే, వెబ్డెస్క్ : Maoists arrest | మావోయిస్టు(Maoist)లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పెద్ద సంఖ్యలో మావోలను పోలీసులు అరెస్టు చేశారు. 20 మందిని అరెస్టు చేయడంతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ములుగు ఎస్పీ డాక్టర్ పి.శబరిశ్(Mulugu SP Shabarish) వెల్లడించారు. ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఇతర పోలీసు అధికారులతో కలిసి ఆయన శనివారం వివరాలను వెల్లడించారు. నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీలో వివిధ హోదాలో పని చేస్తున్న 20 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ(SP) వెల్లడించారు. వారిలో ఒక డివిజన్ కమిటీ సభ్యుని (డీసీఎం)తో పాటు ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు(ఏసీఎం), 14 మంది పార్టీ సభ్యులతో కలుపుకొని మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి నుంచి 3 ఫైవ్ పాయింట్ సిక్స్ ఎంఎం రైఫిళ్లు, నాలుగు ఎస్ఎల్ఆర్ తుపాకులు, ఒక 303 రైఫిల్, నాలుగు 8 ఎంఎం రైఫిల్స్, 12 బోర్ వెపన్స్, రెండు గ్రేనేడ్లు, 17 మ్యాగజైన్లు, 180 రౌండ్ల బుల్లెట్లు, రూ.58,155 నగదు, నాలుగు వాకీ టాకీలు, ఆరు రేడియోలు, 9 ఛార్జింగ్ బ్యాటరీలు, ఆర్ పెన్డ్రైవ్లు, ఆరు మెమొరీ కార్డులు, 8 కార్డు లీడర్స్, రెండు కిట్ బ్యాగులతో పాటు విప్లవ సాహిత్యం ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు.
Maoists arrest | లొంగిపోయిన ఎనిమిది మంది
మరోవైపు ములుగు పోలీసుల(Mulugu Police) ఎదుట ఎనిమిది మంది మావోయిస్టులు శనివారం లొంగిపోయారు. నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ(Maoist Party)కి చెందిన ఎనిమిది మంది మావోయిస్టులు ఎస్పీ పి.శబరిశ్ ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన ఒక డివిజనల్ కమిటీ సభ్యుడు (డీవీసీఎం), ఒక మిలీషియా సభ్యుడితో పాటు ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారని, వారికి తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు ఎస్పీ వెల్లడించారు.