అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకు బీఎన్ఎస్163 (BNS 163) చట్టం అమలులో ఉంటుందని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) వెల్లడించారు. వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో శాంతిభద్రతలకు ఆటంకం కలుగకుండా ఈ సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గల్ఫ్ బాధిత కుటుంబాల విషయంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. అబద్ధాలు ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి వాస్తవాలు తెలియజేయడానికి కనువిప్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం వేల్పూరు వస్తున్నట్లు మానాల తెలిపారు. ప్రశాంత్రెడ్డి వేల్పూర్ రావాలని ఆయన సవాల్ విసిరారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉండటంతో సీపీ సాయి చైతన్య బీఎన్ఎస్ 163 యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.