అక్షరటుడే, వెబ్డెస్క్: Vice President | దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో రెండో స్థానంలో ఉండే ఉపరాష్ట్రపతి పదవి ఇప్పుడు ఖాళీ అయ్యింది. మొన్నటి వరకు ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) ఉండగా, అనారోగ్య కారణాలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన రాజీనామా లేఖ పంపగా, అది అధికారికంగా ఆమోదించబడింది.
దీంతో దేశ రాజకీయాల్లో కొత్త చర్చలు ప్రారంభమయ్యాయి. తదుపరి ఉపరాష్ట్రపతి (Vice President) ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. రాజ్యాంగం ప్రకారం, ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవిని తక్షణమే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ, ప్రతిపక్షాలు తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ పోటీలో ప్రధానంగా వినిపిస్తున్న కొంతమంది ప్రముఖుల పేర్లు ఇలా ఉన్నాయి..
Vice President | కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు ?
బీహార్ సీఎం నీతీశ్ కుమార్(74) (Niteesh Kumar) పేరు కూడా అనూహ్యంగా ఉపరాష్ట్రపతి రేసులో వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన జనతాదళ్ (యునైటెడ్) నేతగా ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నారు. ఈ స్థాయిలో ఆయనకు జాతీయ గుర్తింపు తీసుకొచ్చే అవకాశం ఇది కావొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి పదవిని వీడి, కేంద్రంలో మరింత కీలక పాత్ర పోషించాలన్న సూచనలు పార్టీలో నుంచి రావడమే దీనికి బలాన్నిస్తోంది. ప్రస్తుతం దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్న వీకే సక్సేనా (67) పేరు కూడా ఈ రేసులో ఉంది. ఇటీవల దిల్లీ రాజకీయాల్లో ఆప్ ప్రభుత్వంతో ఆయనకు జరిగిన ఘర్షణలు, పాలనలో తీసుకున్న నిర్ణయాలు ఆయనను వార్తల్లోకి ఎక్కేలా చేశాయి. కార్పొరేట్ రంగం నుంచి వచ్చిన ఆయనకు నిర్వహణా నైపుణ్యం కలిగి ఉంది, ఇది ఉపరాష్ట్రపతి పదవికి ప్లస్ పాయింట్ కావొచ్చు.
జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న మనోజ్ సిన్హా(Manoj Sinha) (66) పేరు కూడా ప్రచారంలో ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయన పాలనలో జమ్మూ కశ్మీర్లో కొంత స్థిరత్వం నెలకొంది. అయితే ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా, ఆయనకు రాజకీయ, పరిపాలనా అనుభవం ఉన్నందున ఈ పదవికి బలమైన అభ్యర్థిగా పరిగణించబడుతున్నారు. ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ అయిన హరివంశ్ నారాయణ్ సింగ్(Harivansh Narayan Singh) కూడా ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నారని తెలుస్తోంది. ఆయన కూడా జనతాదళ్ (యునైటెడ్)కు చెందినవారు, బీజేపీ మద్దతు పొందే అవకాశం ఉండటంతో పోటీలో కొనసాగుతున్నట్లు సమాచారం. గతంలో ప్రతిపక్షాలు గోపాల్ గాంధీ (2017), మార్గరెట్ అల్వా (2022) లను అభ్యర్థులుగా నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా విపక్షాలు ఎవరిని ఎంచుకుంటాయో వేచి చూడాలి. బీహార్ ఎన్నికల ముందు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగకుండా చూసే వ్యూహం బీజేపీ అమలు చేయవచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.