అక్షరటుడే, వెబ్డెస్క్ : Pharma City | ఆంధ్ర ప్రదేశ్లోని అనకాపల్లి (Anakapalli) జిల్లాలో ఘరో విషాదం చోటు చేసుకుంది. జేఎన్ ఫార్మా సిటీ (JN Pharma City)లో విషవాయువులు లీకై ముగ్గురు మృతి చెందారు.
పరవాడ మండలం జేఎన్ ఫార్మా సిటీలో గల సాయిశ్రేయాస్ ఫార్మా (SS Pharma) కంపెనీలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలోని రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ విషవాయువులు లీక్ అయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో పరిమి చంద్రశేఖర్ (సేఫ్టీ మేనేజర్, తెలంగాణ), సరగడం కుమార్ (సేఫ్టీ ఆఫీసర్, మునగపాక, అనకాపల్లి), మరో కార్మికుడు బైడూ భైసాల్ (హెల్పర్, బోడెన్, ఒడిశా)గా గుర్తించారు.
ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను విశాఖపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.