అక్షరటుడే, వెబ్డెస్క్ : Election Commission | భారత ఉపరాష్ట్రపతి(Vice President) పదవి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసినట్లు కేంద్ర హోం శాఖ నుంచి సమాచారం అందిందని తెలిపింది. వీలైనంత త్వరలోనే ఎన్నికల షెడ్యూల్(Election schedule) ప్రకటన వెలువడుతుందని వెల్లడించింది. ధన్ఖడ్ రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత, తదుపరి ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించినట్లు ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. నిబందనల ప్రకారం తదుపరి ఉపాధ్యక్షుడిని వీలైనంత త్వరగా ఎన్నుకోవాల్సి ఉందని పేర్కొంది.
ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ సోమవారం అనూహ్యంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాలు మిగిలి ఉండగానే ఆయన తప్పుకున్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజే ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. ధన్ఖడ్ రాజీనామా(Jagdeep Dhankhar Resign) దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
జస్టిస్ వర్మ(Justice Verma) అభిశంసన వ్యవహారమే ఆయన రాజీనామాకు దారి తీసిందన్న ప్రచారం జరుగుతోంది. అధికారిక నివాసంలో భారీగా నోట్ల కట్టలు వెలుగు చూసిన వ్యవహారంలో వర్మను తొలగించాలని పూర్వ సీజేఐ సంజీవ్ ఖన్నా(CJI Sanjeev Khanna) కేంద్రానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంపీల సంతకాలు సేకరించింది. అయితే, వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజున కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ను కలిసి అభిశంసన తీర్మానాన్ని చేపట్టాలని కోరాయి. దీనిని చర్చకు అనుమతించాలని ఉప రాష్ట్రపతి రాజ్యసభ సెక్రెటరీకి చెప్పడంతో కేంద్రం షాక్కు గురైంది. అభిశంసన తీర్మానాన్ని తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రతిపక్షాల తీర్మానాన్ని చర్చకు చేపట్టాలని ధన్ఖడ్ నిర్ణయించడంపై ఆగ్రహానికి గురైంది. ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారమందడంతో ధన్ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి.