Site icon aksharatoday.in

Stock Market | మిడిల్‌ ఈస్ట్‌లో మళ్లీ టెన్షన్స్‌.. ఆవిరైన ప్రారంభ లాభాలు

Stock Market

Stock Market | మిడిల్‌ ఈస్ట్‌లో మళ్లీ టెన్షన్స్‌.. ఆవిరైన ప్రారంభ లాభాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | మధ్య ప్రాచ్యం(Middle east)లో కమ్ముకొచ్చిన యుద్ధ మేఘాలు ఉదయం వీడిపోయినట్లే కనిపించినా.. మధ్యాహ్నానికి మళ్లీ ముసురుకున్నాయి. దీంతో స్టాక్‌ మార్కెట్‌లో ప్రారంభ లాభాలు క్షీణించాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌ 638 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 208 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కాస్త ఒడిదుడుకులకు లోనైనా పైపైకి వెళ్లాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌(Sensex) గరిష్టంగా 1,122 పాయింట్లు, నిఫ్టీ 346 పాయింట్లు పెరిగాయి. ఆ తర్వాత ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ(Profit booking) దిగారు. దీంతో ప్రధాన సూచీలు ప్రారంభ లాభాలను గణనీయంగా కోల్పోయాయి. చివరికి సెన్సెక్స్‌ 158 పాయింట్ల లాభంతో 82,055 వద్ద, నిఫ్టీ(Nifty) 72 పాయింట్ల లాభంతో 25.044 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్‌ఈలో 2,662 కంపెనీలు లాభపడగా 1,339 స్టాక్స్‌ నష్టపోయాయి. 143 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 108 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 44 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 7 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 10 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌(Lower circuit)ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద రూ. 1.37 లక్షల కోట్లు పెరిగింది.

Stock Market | ట్రంప్ అలా.. వీళ్లిలా..

ఇరాన్‌ – ఇజ్రాయెల్‌ మధ్య సీజ్‌ఫైర్‌ కుదిర్చానన్న ట్రంప్‌(Trump) మాటలు కొన్ని గంటల్లోనే విలువ కోల్పోయాయి. ఆ రెండు దేశాల మధ్య తిరిగి ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరాన్‌ ప్రయోగించిన రెండు క్షిపణులను అడ్డుకున్నామని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ ప్రకటించింది. ప్రతిదాడులకు ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కాట్జ్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో బుల్స్‌(Bulls) రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లిపోయారు. దీంతో స్టాక్‌ మార్కెట్లు మళ్లీ నేలచూపులు చూశాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) మంగళవారం లాభాలతోనే ముగిసినా.. ప్రధాన సూచీలు ఇంట్రాడే గరిష్టాల నుంచి ఒక శాతానికిపైగా పడిపోయాయి.

Stock Market | రాణించిన పీఎస్‌యూ బ్యాంక్స్‌, టెలికాం షేర్లు..

దాదాపు అన్ని రంగాల షేర్లు రాణించాయి. బీఎస్‌ఈ(BSE)లో అత్యధికంగా పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌(PSU bank index) 1.53 శాతం పెరిగింది. టెలికాం 1.18, కమోడిటీస్‌ 1.17 శాతం, మెటల్‌ 1.03 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 0.87 శాతం, బ్యాంకెక్స్‌ 0.79 శాతం, ఆటో సూచీ 0.74 శాతం లాభాలతో ముగిశాయి. ఎనర్జీ సూచీ 0.12 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ 0.10 శాతం నష్టపోయాయి. ఐటీ ఇండెక్స్‌ స్వల్ప నష్టాలతో ముగిసింది. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.71 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.54 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.41 శాతం పెరిగాయి.

Top gainers:బీఎస్‌ఈలో నమోదైన షేర్లలో బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌ 19.99 శాతం, ఎల్టీ ఫుడ్స్‌ 7.85 శాతం, జేఎం ఫైనాన్షియల్స్‌ 7.64 శాతం, హెరిటేజ్‌ ఫుడ్స్‌ 6.99 శాతం, కేఆర్‌బీఎల్‌ 6.84 శాతం పెరిగాయి.

Top losers:గార్డెన్‌ రీచ్‌ 8.8 శాతం, బీఈఎంఎల్‌ 7.09 శాతం, కేపీఐటీ టెక్నాలజీస్‌ 6.17 శాతం, మిశ్రధాతు నిగమ్‌ 5.35 శాతం, ఆయిల్‌ ఇండియా 5.35 శాతం నష్టపోయాయి.

Exit mobile version