అక్షరటుడే, వెబ్డెస్క్:Hydraa | హైదరాబాద్(Hyderabad)లోని శేరిలింగంపల్లి, కూకట్పల్లి మండలాల సరిహద్దులోని గుట్టల బేగంపేట, అల్లాపూర్ గ్రామాల మధ్య ఉన్న సున్నం చెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలోనే సియెట్(ఎస్ఐఈటీ) లే అవుట్ ఉందని హైడ్రా(Hydraa) స్పష్టం చేసింది. ఆ లే అవుట్కు సంబంధించి గతంలో హెచ్ఎండీఏ(HMDA) ఇచ్చిన డ్రాఫ్ట్ లే ఔట్ను కూడా ఇదే కారణంతో రద్దు చేసిన విషయాన్ని హైడ్రా గుర్తు చేసింది. ఇక్కడ గతంలో ఇంటి నిర్మాణానికి అనుమతిచ్చిన జీహెచ్ఎంసీ(GHMC) కూడా ఆ అనుమతులను రద్దు చేసుకుందని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో తమకు న్యాయం చేయాలంటూ సియట్ ప్లాట్ల యజమానులు ఆందోళన చేయడంలో అర్థం లేదని స్పష్టం చేసింది.
సున్నం చెరువు 32.60 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1975లో సర్వే ఆఫ్ ఇండియా(Survey of India) లెక్కలు ఇదే స్పష్టం చేస్తున్నాయి. అయితే చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో లే అవుట్ వేసి ప్లాట్లు విక్రయించారు. ఇటీవల హైడ్రా సర్వే చేపట్టి లే అవుట్ చెరువులో ఉందని తేల్చింది. దీంతో అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని పలువురు బాధితులు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైడ్రా స్పందించింది. లే అవుట్ చెరువులోనే ఉందని, ఆందోళన చేయడంలో అర్థం లేదని పేర్కొంది. ప్రస్తుతం ఆ లే అవుట్(Lay Out)లో ఎలాంటి నిర్మాణాలు జరగలేదని, ఖాళీగా ఉన్న ప్లాట్లకు సంబంధించి అర్హులమని భావిస్తే నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని హైడ్రా సూచించింది. చెరువు పునరుద్ధరణ పనులకు ఆటంకం కలిగించవద్దని విజ్ఞప్తి చేసింది.