Site icon aksharatoday.in

EPFO | మూడేళ్ల‌లోనే రూ.340 కోట్ల ఖ‌ర్చా..? ఈపీఎఫ్​వో వెబ్‌సైట్ నిర్వ‌హ‌ణ‌కు వెచ్చించిన వ్యయంపై అనుమానాలు

EPFO

EPFO | మూడేళ్ల‌లోనే రూ.340 కోట్ల ఖ‌ర్చా? వెబ్‌సైట్ నిర్వ‌హ‌ణ‌కు వెచ్చించ‌డంపై అనుమానాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: EPFO | ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (ఈపీఎఫ్‌వో) వెబ్‌సైట్ నిర్వ‌హ‌ణ కోసం ఆ సంస్థ భారీగా ఖ‌ర్చు చేస్తోంది. వెబ్‌సైట్ అభివృద్ధి(Website Development), నిర్వ‌హ‌ణ‌, హోస్టింగ్ కోసం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. అయితే, వెబ్‌సెట్ నిర్వ‌హ‌ణ పేరిట గ‌త మూడేళ్ల‌లోనే రూ.340 కోట్ల వ్య‌యం చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇంత మొత్తం వెచ్చించ‌డం అనేక అనుమానాలు తావిస్తోంది. నేష‌న‌ల్ డేటా సెంట‌ర్(National Data Center), ఇన్ఫార్మేష‌న్ టెక్నాల‌జీ(Information Technology) శాఖ‌ల‌తో పాటు కొన్ని ప్రైవేట్ ఏజెన్సీల సాయంతో ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్ అభివృద్ధితో పాటు నిర్వ‌హ‌ణ‌ను నిర్వ‌హిస్తోంది. అయితే, భారీ మొత్తం ఖ‌ర్చు చేయ‌డంపైనే సందేహాలు రేకెత్తుతున్నాయి. సామాజిక కార్య‌క‌ర్త ఒక‌రు స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ఈ స‌మాచారాన్ని సేక‌రించి బ‌య‌ట పెట్టారు.

EPFO | విస్తృతంగా ఆన్‌లైన్ సేవ‌లు

కోట్లాది మంది ఖాతాదారుల‌ను క‌లిగిన‌ ఈపీఎఫ్‌వో(EPFO) త‌న సేవ‌ల‌ను విస్తృతం చేస్తోంది. ప్ర‌ధానంగా ఆన్‌లైన్ సేవ‌ల‌ను విస్త‌రిస్తోంది. మాన్యూవ‌ల్ ప‌ద్ధ‌తిలో రోజుల త‌ర‌బ‌డి సాగే ప్ర‌క్రియ‌కు చెక్ పెడుతూ వేగంగా సేవ‌లందిస్తోంది. గ‌తంలో విత్‌డ్రాయ‌ల్ ప్ర‌క్రియ అంతా మాన్యూవ‌ల్ గానే జ‌రిగేది. సెటిల్‌మెంట్ల‌ కోసం, పింఛ‌న్ల కోసం ఖాతాదారులు నెల‌ల త‌ర‌బ‌డి కార్యాల‌యాల చుట్టూ తిరిగే వారు. ఈ ప‌ద్ధ‌తిని ఈపీఎఫ్‌వో స‌మూలంగా మార్చేసింది. పింఛ‌న్‌దారులు(Pensioners) కార్యాల‌యాల వెంట తిర‌గ‌కుండా ఇంట్లో నుంచే సేవ‌లు పొందేలా ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్ర‌మంలో వెబ్‌సైట్‌తో పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల‌పై భారీగానే ఖ‌ర్చు పెడుతోంది.

EPFO | నిర్వ‌ణ‌కు కోట్ల రూపాయ‌లా?

ఆన్‌లైన్ సేవ‌ల విస్త‌ర‌ణ నేప‌థ్యంలో ఈపీఎఫ్‌వో చేస్తున్న వ్య‌యం అనుమానాల‌కు తావిస్తోంది. గ‌త మూడేళ్ల‌లోనే వెబ్‌సైట్ అభివృద్ధి, నిర్వ‌హ‌ణ‌, హోస్టింగ్(Hosting) కోసం ఈపీఎఫ్‌వో కోట్లాది రూపాయ‌లు వెచ్చించింది. 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.84.96 కోట్లు, 2023-24లో రూ.99.56 కోట్లు, 2024-25లో 155.94 కోట్లు ఖ‌ర్చు చేసింది. ఈ విష‌యాన్ని ఆ సంస్థ అధికారికంగా చెబుతున్న‌దే. అయితే, సైట్ నిర్వ‌హ‌ణ‌కు ఇంత‌గా వెచ్చించ‌డంపైనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు, భారీగా ఖ‌ర్చు చేస్తున్న‌ప్ప‌టికీ సేవ‌ల్లో అంత‌రాయం క‌లుగుతుండ‌డంతో పింఛ‌న్‌దారులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. పాస్‌బుక్ లోడ్ కావడానికి భారీగా స‌మ‌యం తీసుకుంటుండ‌డం, ఓటీపీల రాక‌లో జాప్యం వంటివి ఇబ్బంది క‌లిగిస్తున్నాయి. ఇక క్లెయిమ్‌లకు వారాల సమయం పడుతోంది. సైట్ నిర్వ‌హ‌ణ కోసం ఈపీఎఫ్‌వో ఇంత‌గా వెచ్చిస్తున్న సేవ‌ల్లో అంత‌రాయం క‌లుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Exit mobile version