అక్షరటుడే, వెబ్డెస్క్: Janasena Party | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన దృష్టిని పూర్తిగా పార్టీ బలోపేతంపై కేంద్రీకరించబోతున్నారు. 2024 ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 100% విజయంతో రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన జనసేన (Janasena Party), ఇప్పుడు 2029 సాధించాలన్న దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తోంది.
పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇప్పటికే కమిటైన సినిమాలు దాదాపు పూర్తి చేశారు. ఇక అక్టోబర్ నుంచి పూర్తిగా రాజకీయాలకే అంకితమవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల వరకు పార్టీ కార్యకలాపాలపై పూర్తిగా దృష్టి సారించనున్నారు. ప్రస్తుతం ఉన్న 21 నియోజకవర్గాలతో పాటు, మరిన్ని 50–60 నియోజకవర్గాల్లో పార్టీ బలపడేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే ప్రారంభం కానుంది.
Janasena Party | స్పీడ్ పెంచనున్న పవన్..
ఈ సర్వే ఆధారంగా పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలు, బలపడే అవకాశాలు ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసి, ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది జనసేన. పార్టీ బలపేతం కోసం త్వరలో జిల్లా అధ్యక్షుల (District Presidents) నియామకం చేపట్టనుంది.
స్థానిక స్థాయిలో ప్రభావవంతమైన నాయకులను ఎంపిక చేసి, పార్టీని జిల్లా స్థాయిలో పటిష్టం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో “ఇంటింటికీ జనసేన” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచన ఉంది. ఈ ద్వారా కార్యకర్తలు ప్రజలతో నేరుగా మమేకం అయ్యి, సమస్యలు, అభిప్రాయాలను స్వయంగా తెలుసుకోనున్నారు.
2024లో టీడీపీ (TDP), బీజేపీ (BJP)తో కూటమిలో పోటీ చేసిన జనసేన, 21కి 21 సీట్లను గెలుచుకోవడం ద్వారా తన సత్తా చూపించింది. తద్వారా పవన్ కల్యాణ్ కూటమి విజయానికి కీలక నేతగా మారారు. భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేసే ఉద్దేశంతో, సొంతంగా పార్టీ బలాన్ని పెంచేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు(Gaju Glass) గుర్తును శాశ్వతంగా కేటాయించడం ద్వారా పార్టీకి ప్రజల్లో స్థిరమైన గుర్తింపు ఏర్పడింది. ఈ పార్టీ వచ్చే ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించనుంది. 2019లో కేవలం ఒక్క సీటుతో పరిమితమైన జనసేన, 2024లో భారీ విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ దూరదృష్టితో, 2029లో పార్టీని ముఖ్య రాజకీయ శక్తిగా నిలబెట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.