అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana BJP | కమలంలో సెగ రాజుకుంటోంది. ఆధితప్య పోరు రచ్చకెక్కుతోంది. తెలంగాణ బీజేపీలో (Telangana BJP) అంతర్గత కలహాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటి రాజాసింగ్ ఎపిసోడ్ మరిచిపోక ముందే, ఇద్దరు సీనియర్ల మధ్య ఆధిపత్య పోరు బయట పడింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay), మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్ (MP Etala Rajender) మధ్య నెలకొన్న వివాదం కాషాయ శ్రేణులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పుకునే బీజేపీలో నెలకొన్న కలహాలు కేడర్ ను కలవరపెడుతున్నాయి. సిద్ధాంతం కోసం పోరాడే కాషాయ దళంలో సిగపట్లు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్(BRS)పై ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాల్సింది పోయి.. ఇలా సీనియర్ నేతలే రచ్చకెక్కుతుండడం పార్టీ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
Telangana BJP | ఆధిపత్య పోరు..
రాష్ట్ర బీజేపీలో చాలా కాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ముఖ్య నేతలు ఒకరంటే ఒకరికి పడని దుస్థితి ఏర్పడింది. ముందుండి నడిపించాల్సిన వారి మధ్య అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరాయి. పార్టీలో పెత్తనం కోసం వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ఎంపీల మధ్యే ఈ ఆధిపత్య పోరు ఎక్కువగా నెలకొంది. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు (Raghunandan Rao), ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి ఒక ఊపు తీసుకొచ్చిన బండి సంజయ్ అంటే మిగతా నాయకులకు పొసగడం లేదు.
పార్టీలో ఆధిపత్య పోరు గురించి ఇటీవలే రాజీనామా చేసిన రాజాసింగ్ (Raja Singh) వెల్లడించిన సంగతి తెలిసిందే. కొందరికి పార్టీ ఎదగడం ఇష్టం లేదని, అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా చేజేతులా పోగొడుతున్నారని, ఇతర పార్టీలతో కలిసి నడుస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేయడం పార్టీలో నెలకొన్న దుస్థితికి అద్దం పట్టింది. మొన్నటిదాకా అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి (Kishan Reddy), కొత్త సారథి రాంచందర్ రావు (Ramchandra Rao) మాటే పార్టీలో వినే వారే లేకుండా పోయారు.
Telangana BJP | బండి వర్సెస్ ఈటల..
కరీంనగర్ జిల్లాకు (Karimnagar district) చెందిన ఇద్దరు ముఖ్య నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. పరోక్షంగా విమర్శలు, ప్రతి విమర్శలతో పార్టీని బజారుకీడ్చుతున్నారు. మొన్న హుజురాబాద్ లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో బండి సంజయ్ పరోక్షంగా ఈటలపై విమర్శనాస్త్రాలు సంధించారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha elections) తనకు ఓట్లు రాకుండా కొందరు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) గెలిచే వారికి అవకాశాలు వస్తాయని, బీజేపీలో ఏ గ్రూప్ లేదని, ఉన్నది మోదీ గ్రూపేనని వ్యాఖ్యానించారు.
దీనిపై ఈటల ఘాటుగా స్పందించారు. శత్రువుతో కొట్లాడవచ్చు కానీ కడుపులో కత్తులు పెట్టుకొనే వారితో పోరాటం చేయలేమని విమర్శించారు. రాజకీయాల్లో కొంతమంది ఉంటారని.. వారు ఇతరులను ఎదగనివ్వకుండా చేయడమే వాళ్ల పని అని బండిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కచ్చితంగా హుజురాబాద్ (Huzurabad) వస్తా.. మీ వెంట ఉంటానని హామీ ఇచ్చారు. తనను ఏడుసార్లు గెలిపించారని… ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో చిన్న మనస్కులు, కురుస మనస్తత్వం ఉన్న వాళ్లు ఉంటారని ఎద్దేవా చేశారు. వాళ్లు కడుపులో కత్తులు పెట్టుకొని ఉంటారని.. అలాంటి వారితో యుద్ధం చేయడం కష్టమే కానీ ఎదురెళ్లి నిలబడాలని చెప్పుకొచ్చారు.
Telangana BJP | జాతీయ నాయకత్వం దృష్టి సారిస్తేనే..
ముఖ్య నేతల పరస్పర విమర్శలతో కాషాయ దళంలో కలవరం నెలకొంది. ఇప్పటికే రాజాసింగ్ ఎపిసోడ్ మరువక ముందే, వీరి మధ్య ముదిరిన వర్గపోరుపై కేడర్ లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. జాతీయ నాయకత్వం తెలంగాణపై దృష్టి సారించి అంతర్గత విభేదాలను తొలగించాలన్న భావన వ్యక్తమవుతోంది. లేకపోతే పార్టీ ఎదగడం కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. వాస్తవానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు (assembly elections) ముందు బీజేపీకి మంచి అవకాశం ఏర్పడింది. కానీ, ఆధిపత్య పోరు కారణంగా త్రిముఖ పోరులో వెనుకబడింది. ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతున్న తరుణంలో 2028 ఎన్నికల్లో బీజేపీ గెలిచే చాన్స్ ఉంటుంది. కానీ అంతర్గత పోరుతో సతమతమవుతున్న ఆ పార్టీ ప్రక్షాళన చేయకపోతే తెలంగాణలో అధికారంలోకి రావడం కష్టంగానే మారుతుంది.