అక్షరటుడే, వెబ్డెస్క్: Govt Hospitals | ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవడానికి చాలా మంది ఆలోచిస్తుంటారు. దీనికి కారణం అక్కడ వైద్యులు అందుబాటులో ఉండరు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనే ఆరోపణలు ఉండడమే. అప్పొసొప్పో చేసి మరీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపెట్టుకుంటారు. ప్రభుత్వ దవాఖానాకు (Govt Hospitals) పోవాలంటే భయపడుతుంటారు!
ప్రభుత్వం మాత్రం సర్కారు దవాఖానాల కోసం రూ.కోట్ల నిధులు విడుదల చేస్తోంది. అన్ని రకాల వసతులు కల్పిస్తోంది. ఇటువంటి తరుణంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందితే ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల మీద నమ్మకం పెరుగుతుంది. తాజాగా ఓ ఐఏఎస్ అధికారి (IAS Officer) ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్ (Eye Operation) చేయించుకొని ఆదర్శంగా నిలిచారు.
Govt Hospitals | సరోజిని దేవి కంటి ఆస్పత్రిలో..
హైదరాబాద్ నగరంలోని మెహదీపట్నంలో సరోజిని దేవి ప్రభుత్వ కంటి ఆస్పత్రి (Sarojini Devi Government Eye Hospital) ఉంది. తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సబ్యసాచి ఘోష్ (Sabyasachi Ghosh) తన కంటి ఆపరేషన్ కోసం ఈ ఆస్పత్రికి వచ్చారు. బుధవారం వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారు. రీయింబర్స్మెంట్తో ప్రైవేట్ చికిత్సకు అర్హత ఉన్నప్పటికీ ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారు. ఇలాంటి చర్యలు ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచుతాయి.
Govt Hospitals | ఆదర్శంగా నిలిచిన కలెక్టర్లు
కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్ గతంలో తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేయించారు. కలెక్టర్ భార్య శ్రద్ధకు పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించారు. అలాగే పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సైతం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తన భార్యకు డెలివరీ చేయించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే సిబ్బంది పనితీరు మెరుగవడంతో పాటు ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది.