అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ శివారులోని మరో కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం (Major Fire Accident) చోటు చేసుకుంది. దుండిగల్ తండాలోని రాంకీ కంపెనీలో (Rankey Company) బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి.
దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రసాయనాల చర్యతో మంటలు చేలరేగినట్లు సమాచారం. మంటలు భారీగా ఎగిసిపడటంతో పాటు, భారీగా పొగ అలుముకోవడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. పరిశ్రమలో కెమికల్స్ను కలిపే సమయంలో పేలుడు చోటు చేసుకున్నట్లు సమాచారం. దీంతో రాంకీ ఫ్యాక్టరీకి దగ్గరలో ఉన్న తండావాసులు తీవ్రభయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది(Fire Fighters) ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
Hyderabad | వరుస ప్రమాదాలతో ఆందోళన
పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉండడంతో కార్మికులతో పాటు, స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. నగర శివారులోని పాశమైలారం సిగాచి పరిశ్రమలో ఇటీవల పేలుడు చోటుచేసుకొని 44 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా ఏడుగురి ఆచూకీ లభించలేదు. వారు మృతి చెందినట్లేనని అధికారులు ప్రకటించారు.
అనంతరం అదే గ్రామంలోని ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో మంటలు వ్యాపించాయి. ఇటీవల హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్లో గల ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సనత్నగర్ జింకలవాడలో ఉన్న డ్యూరోడైన్ ఇండస్ట్రీస్లో (Durodine Industries) గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. తాజాగా రాంకీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కార్మికులు, పరిశ్రమలు గల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.