అక్షరటుడే, వెబ్డెస్క్: Gurukul Schools | గరుకులాల్లో మరణ మృదంగం మోగుతోంది. వరుసగా విద్యార్థుల (students) ఆత్మహత్య ఘటనలు చోటు చేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తోంది. గత వారం రోజుల్లోనే నలుగురు బలవన్మరణానికి పాల్పడగా, తాజాగా ఆర్మూర్(Armoor)లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం కలవరపాటుకు గురి చేసింది.
పట్టించుకునే వారు లేకపోవడం, ఉన్నతాధికారులు తనిఖీలు మరువడంతో గురుకులాలు (Gurukul) దారుణంగా తయారయ్యాయి. మౌలిక వసతులు లేక అనేక సమస్యలతో కూనారిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. వారం వ్యవధిలోనే ఐదుగురు విద్యార్థులు అకారణంగా అసువులు బాసినా పట్టించుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది.
Gurukul Schools | వరుసగా ఆత్మహత్యలు..
ఈ ఏడాది ఆరంభం నుంచే గురుకుల, సంక్షేమ హాస్టళ్లల్లో (Gurukula and welfare hostels) వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కేవలం వారం వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు గురుకుల విద్యార్థులు (Gurukul students) బలవన్మరణాలకు పాల్పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. సూర్యాపేట జిల్లా (Suryapet district) నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని తనుషా మహాలక్ష్మి, మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar district) మల్దకల్ గురుకులంలో చదవడం ఇష్టంలేక హరికృష్ణ, పాలమాకుల కేజీబీవీ విద్యార్థిని నవీంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేటలో గురుకుల కళాశాల భవనం పైనుంచి దూకి విద్యార్థిని సంధ్య ఆత్మహత్య చేసుకున్నది. ఆసిఫాబాద్ లోని గిరిజన ఆశ్రమ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి సుర్పం శేఖర్, హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లకపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని శ్రీవాణి బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా ఆర్మూర్ గిరిజన కళాశాలలో సెకండియర్ బైపీసీ (second-year B.Sc student) చదువుతున్న గడ్డం సంతోష్ శనివారం ఉదయం చెట్టుకు ఉరేసుకున్నాడు. ఇలా ఈ విద్యా సంవత్సరం ఆరంభం నుంచి ఇప్పటివరకు పది మంది వరకు అర్ధాంతరంగా ఉసురు తీసుకున్నారు.
Gurukul Schools | గ్యాప్ లేకుండా చదువులు..
సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, బీసీ, ఎస్టీ గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. కళాశాలలు, పాఠశాలల్లో చదువుతున్ను విద్యా కుసుమాలు నేలరాలుతుతండడం ఆవేదనకు గురి చేస్తోంది. గురుకుల సమయ పాలనను మార్చి విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం లేకుండా చేయడం, ఇష్టారీతిన దూరప్రాంతాల్లో అడ్మిషన్లు ఇవ్వడమే ఆత్మహత్యలకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో (government schools) చదువుతున్న విద్యార్థులకు ఉదయం తరగతులు ప్రారంభమైన తరువాత గంటన్నరకు షార్ట్ బ్రేక్, మూడున్నర గంటల గ్యాప్లో లంచ్ బ్రేక్, ఆ తర్వాత గంటన్నర గ్యాప్ లో తిరిగి షార్ట్ బ్రేక్ ఉంటాయి.
కానీ, గురుకుల విద్యార్థులను (gurukul students) రోబోల్లా ట్రీట్ చేస్తున్నారనే భావన నెలకొంది. మొత్తం 16 గంటల షెడ్యూల్లో కనీసం 2.30 గంటల పాటైనా పర్సనల్ టైమ్ లేదని, అందులోనే బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ పూర్తి చేయాల్సి ఉంటుందని, ఇది విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరోవైపు, ఘటన జరిగిన వెంటనే హడావుడి చేయడం, విచారణ కమిటీ వేయడం, అక్కడి వార్డెన్ లేదా ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం తప్ప అసలు కారణాలను వెలికితీయడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Gurukul Schools | ప్రవేశాల తీరు కూడా కారణమే..
ఈసారి అడ్మిషన్ల విధానాన్ని మార్చడం కూడా విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. జిల్లాల వారీగా మెరిట్ తో కాకుండా, రాష్ట్ర మెరిట్ ఆధారంగా సీట్లను కేటాయించారు. నిజామాబాద్ జిల్లా (Nizamabad district) విద్యార్థికి ఆదిలాబాద్ లో, కామారెడ్డి విద్యార్థికి (Kamareddy student) నిజామాబాద్లో అడ్మిషన్లు ఇచ్చారు. ఇంటర్ ప్రవేశాల్లోనూ ఎస్సీ గురుకులం ఇదే రీతిన అడ్మిషన్ ప్రక్రియను నిర్వహించారు. దీంతో విద్యార్థులకు తమ సొంత జిల్లాలో కాకుండా ఎక్కడెక్కడో సీట్లు రావడంతో ఇంటిపై బెంగ పెట్టుకున్నారు. ఈ క్రమంలో గురుకులంలో ఉండలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.