అక్షరటుడే, ఇందూరు: సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy), పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), కొండా సురేఖ (konda surekha), అట్లూరి లక్ష్మణ్ కలెక్టర్లను ఆదేశించారు.
సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శి తో కలిసి మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సంక్షేమ గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందేలా చూడాలన్నారు.
ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ వారంలో ఒకరోజు అధికారులు హాస్టల్లో బస చేయాలని ఆదేశించారు. పెంచిన డైట్ ఛార్జీలకు (Diet charges) అనుగుణంగా నాణ్యమైన ఆహారం అందేలా చూడాలన్నారు. హాస్టల్ ప్రాంగణం పచ్చదనం పరిశుభ్రతతో ఉంచాలని, శానిటేషన్ చేపట్టాలని.. అన్ని జిల్లాల్లో ఎగ్ టెండర్స్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు.
Welfare Schemes | బస్టాండ్లో వేడుకలు నిర్వహించాలి
మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్రంలో 200 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు (Free bus) ప్రయాణం చేశారని మంత్రులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 97 బస్సు డిపోలు, 321 బస్స్టేషన్లలో వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యాల మేరకు అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే విధంగా చూడాలన్నారు.
ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇసుక కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని, ఇసుకను ఉచితంగా అందజేయాలని, లబ్ధిదారునికి ఎలాంటి భారం కలగకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయి గౌడ్ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.