అక్షరటుడే, వెబ్డెస్క్ : MLC Kavitha | బీసీ రిజర్వేషన్లపై(BC Reservations) ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి ప్రభుత్వం కేంద్రానికి పంపింది. అయితే కేంద్రం ఆ బిల్లులకు ఆమోదం తెలపకపోవడంతో ఆర్డినెన్స్ ద్వారా స్థానిక ఎన్నికల్లో(Local Elections) 42శాతం రిజర్వేషన్ తీసుకు వస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ నాయకులు ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తున్నారు. దీనిపై తాజాగా ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) స్పందించారు. ఆమె బంజరాహిల్స్లోని తన నివాసంలో మీడియా చిట్చాట్లో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు ఆర్టినెన్స్ వద్దని చెప్పడం సరికాదన్నారు. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సరైందేనని ఆమె పేర్కొన్నారు. తాను న్యాయ నిపుణులతో చర్చించే ఆ మాటలు అంటున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ వాళ్లు కూడా తన దారికి రావాల్సిందేనని అన్నారు. అందుకు నాలుగు రోజులు టైం తీసుకుంటారేమోనని వ్యాఖ్యలు చేశారు.
MLC Kavitha | వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..
ఇటీవల కవితపై ఎమ్మెల్సీ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే మల్లన్న వ్యాఖ్యలపై కేసీఆర్(KCR) కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ(BRS Party) మౌనం వహించింది. ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు(Congress Leaders), మంత్రులు ఖండించిన బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో కవిత మాట్లాడుతూ.. తనపై మల్లన్న చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాలేదని.. దానిని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
కాగా.. బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకిస్తున్న బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్(BC Reservations Ordinance)కు కవిత బహిరంగ మద్దతు తెలపడం గమనార్హం. న్యాయ నిపుణులతో చర్చించాకే తాను ఆర్డినెన్స్కు మద్దుతు తెలుపుతున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే బీఆర్ఎస్ మాత్రం ఆర్డినెన్స్ ప్రభుత్వం బీసీలను మోసం చేయాలని చూస్తోందని ఆరోపిస్తోంది. బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఒత్తిడి చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో కవిత వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.