అక్షరటుడే, వెబ్డెస్క్ : Encounter | భద్రతా బలగాలు (Security Forces) మావోయిస్టులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. నిత్యం కూంబింగ్ చేపడుతూ.. దట్టమైన అటవీ ప్రాంతాలను సైతం జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో వరుస ఎన్కౌంటర్లు (Encounters) చేసుకుంటుండగా.. భారీ సంఖ్యలో మావోలు మృతి చెందుతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ (Narayanapur) జిల్లాలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
Encounter | అబూజ్మడ్ అడవుల్లో..
నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో నక్సల్స్ ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో శుక్రవాం జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఏకే 47, ఎస్ఎల్ఆర్ రైఫిల్ సహా పలు ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
Encounter | ఆపరేషన్ కగార్తో కంగారు..
దేశంలో 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగా వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఒకప్పుడు మావోలకు కంచు కోటగా ఉన్న ప్రాంతాలను సైతం స్వాధీనం చేసుకుంటున్నాయి. దీంతో మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఎన్కౌంటర్లలో భారీగా కేడర్ కోల్పోవడంతో పాటు.. కీలక నేతలు హతం అవుతుండటంతో కలవరం చెందుతున్నారు. ఈ క్రమంలో తాము చర్చలకు సిద్ధమని.. కేంద్ర ఆపరేషన్ కగార్ ఆపాలని వారు ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం చర్చల్లేవని స్పష్టం చేసింది. ఆయుధాలు వీడి లొంగిపోవడమే మావోయిస్టుల ముందు ఉన్న మార్గమని ఇటీవల అమిత్ షా అన్నారు.