అక్షరటుడే, వెబ్డెస్క్: Railway Passengers | మీరు ఎమర్జెన్సీ కోటా ద్వారా తరచూ టిక్కెట్లు బుక్ చేసుకుంటారా? అయితే, ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. ప్రయాణికుల కోసం సేవలను విస్తృతం చేస్తున్న రైల్వేశాఖ ఎప్పటికప్పుడు కొత్త విధానాలకు శ్రీకారం చుడుతోంది. అత్యవసర కోటాకు సంబంధించి నిబంధనలు సవరించింది. రైల్వే మంత్రిత్వ శాఖ (Railway Ministry) జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. రైలు బయలుదేరడానికి కనీసం ఒక రోజు ముందుగానే తమ అభ్యర్థనను దాఖలు చేయాలి.
Railway Passengers | 12 గంటల ముందే..
అత్యవసర కోటా (Emergency Quota) నిబంధనల మార్పుకు సంబంధించిన సర్క్యులర్ను రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం జారీ చేసింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయలుదేరే అన్ని రైళ్లకు సంబంధించిన అత్యవసర కోటా అభ్యర్థన, ప్రయాణానికి ముందు రోజు 12 గంటల లోపు EQ సెల్కు చేరుకోవాలని రైల్వేశాఖ (Railway Department) పేర్కొంది. మధ్యాహ్నం 2.01 గంటల నుంచి అర్ధరాత్రి 11.59 గంటల మధ్య బయలుదేరే మిగిలిన అన్ని రైళ్లకు అత్యవసర కోటా అభ్యర్థన, ప్రయాణానికి ముందు రోజు 16.00 గంటల వరకు EQ సెల్కు చేరుకోవాలని తెలిపింది.
Railway Passengers | చార్టు ఖరారు సమయంలో మార్పులు..
రైల్వే శాఖ రిజర్వేషన్ చార్టు(Reservation Chart) ఖరారు సమయంలో మార్పులు చేయడంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రిజర్వేషన్ చార్టు ఖరారు సమయాన్ని ఇటీవల రైల్వే మంత్రిత్వ శాఖ సవరించింది. రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ను ఖరారు చేయాలని నిర్ణయించింది. గతంలో రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ను ఖరారు చేసే వారు.
అయితే, ఇప్పుడు దాన్ని 8 గంటలకు పొడిగించారు. మధ్యాహ్నం 2.00 గంటలకు ముందు బయలుదేరే రైళ్లకు సంబంధించిన చార్ట్ను అంతకు ముందు రోజు రాత్రి 9 గంటలకు ఖరార చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే అత్యవసర కోటా అభ్యర్థనలను సమర్పించే సమయాన్ని కూడా సవరించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, రైలు బయలుదేరిన అదే రోజున చేసిన అభ్యర్థనలు ఇకపై అంగీకరించబడవు. ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాలకు, అత్యవసర కోటా వసతి కోసం అభ్యర్థనలను, ముఖ్యంగా ఆదివారాలు లేదా ఆదివారం తర్వాత వచ్చే సెలవు దినాలలో బయలుదేరే రైళ్లకు సంబంధించి అంతకు ముందు రోజు వర్కింగ్ డే రోజున సమర్పించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.